అనంతపురం: వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయన్నారు. తనను చంపేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబు కుట్ర పన్నారని అన్నారు.
శింగనమల వద్ద తన వాహనాన్ని ఢీకొని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, తన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందన్నారు. తన వాహనం పైకి దూసుకొచ్చింది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కు చెందిన టిప్పర్ అని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాకు గన్ మెన్లు తొలగించారని అన్నారు. శత్రువుల నుంచి ప్రాణహాని ఉంది కనుకే నాకు పదేళ్లుగా గన్ మెన్ల సౌకర్యం ఉందని, తన సోదరుడు తోపుదుర్తి రాజా పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. హత్యలు చేయించడం, అక్రమ కేసులు బనాయించటమే మంత్రి నారా లోకేష్ నైజమా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.


