సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్న రావణ్కు పిఠాపురం మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..‘రావణ్ కేసులో న్యాయం గెలిచిన రోజు ఇది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని భావించిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు. ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కులను హరించడమేనని అవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు నా బాడీ షేమింగ్ చేస్తూ అహేళనగా మాట్లాడారు.. దానికి చట్టం లేదు?. కాళ్లకు కాళ్ళు.. కీళ్లకు కీళ్లు విరగొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్దమా?.
పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే న్యాయబద్దమా? వాటిమీద కేసులు ఉండవా?. రఘురామ కృష్ణంరాజుకు రాజకీయ సమాధి కడతానంటే తప్పా? నా మీద కేసు కడతారా?. మీ కేసులకు భయపడేది లేదు. టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయం. రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా. రావణ్కు ఏం జరిగినా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. సోషల్ మీడియా కేసుల్లో ముందుగా టీడీపీ, జనసేన నేతలను కంట్రోల్ చెయ్యమని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకంటే ముందు పిఠాపురం పోలీసులకు షాక్ తగిలింది. ప్రశ్న రావణ్ రిమాండ్ను మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేశారు. దీంతో, వ్యక్తిగత పూచికతుపై రావణ్ విడుదలయ్యారు. ఈ క్రమంలో రావణ్ తరపున వాదనలు జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. అనంతరం, విడుదలైన వెంటనే పోలీసులు.. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు రావణ్ను అదుపులోకి తీసుకున్నారు.



