ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్ 2026లో నేడు (జూన్ 30) తొలి సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓ సారి ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సీజన్లో వెస్టిండీస్ అండర్ డాగ్ హోదాలో బరిలోకి దిగి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయ జట్టుగా ఫైనల్-4కు చేరింది. వెస్టిండీస్ తమ చివరి రెండు గ్రూప్ మ్యాచ్ల్లో (ఇంగ్లండ్, ఐర్లాండ్) చేతుల్లో ఓడినా సెమీస్కు చేరడం ఆసక్తికర పరిణామం.
ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు టీమిండియా సెమీస్ ఆశలను ఆవిరి చేసి ఫైనల్-4కు చేరింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్పై విజయం సాధించడంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కింది. జులై 2న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బి టాపర్ ఇంగ్లండ్తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటుంది.
విండీస్-ఆసీస్ తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ టోర్నీలో తాము అండర్ డాగ్స్ అని చెప్పుకుంటూ, అదే తమ బలమని పేర్కొంది.
"మా నుంచి ఎవరూ విజయం ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. నేటి సెమీఫైనల్లో ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. వాళ్లు గెలవాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. కానీ మేం గెలిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. అందుకే మేం నిర్భయంగా ఆడగలం.
వెస్టిండీస్ గతంలో ఎన్నోసార్లు అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా ప్రపంచకప్లలో తమ జట్టు ప్రత్యేకంగా రాణిస్తుంది. తమను తక్కువ అంచనా వేయడం ఆటగాళ్లలో మరింత పోరాటస్ఫూర్తిని పెంచుతుంది" అని చెప్పింది.
ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ మ్యాచ్లో మేం ఒత్తిడికి లోనయ్యాం. కానీ ఎవరైనా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే, మాలో మరో రకమైన జోష్ కనిపిస్తుందని వివరించింది.


