ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన త్రీసా-గాయత్రీ జోడీ | BWF World Championships: Treesa, Gayatri Pair Enter Womens Doubles Pre Quarters | Sakshi
Sakshi News home page

BWF World Championships: ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన త్రీసా-గాయత్రీ జోడీ

Aug 18 2026 7:43 PM | Updated on Aug 18 2026 8:08 PM

BWF World Championships: Treesa, Gayatri Pair Enter Womens Doubles Pre Quarters

source: X

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది.

త్రీసా-గాయత్రీ జోడీ కేవలం 38 నిమిషాల్లో 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే త్రీసా–గాయత్రీ దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు.

త్రీసా పవర్‌ఫుల్ స్మాష్‌లతో పాయింట్లు సాధించగా.. గాయత్రీ ర్యాలీలను కొనసాగిస్తూ చక్కటి డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. దీంతో తొలి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లోనూ భారత జోడీ అదే దూకుడును కొనసాగించింది. విరామ సమయానికి 11-4 ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థుల అనవసర తప్పిదాలను కూడా సద్వినియోగం చేసుకున్న త్రీసా–గాయత్రీ.. వేగవంతమైన కదలికలు, అద్భుతమైన లైన్ జడ్జ్‌మెంట్‌తో మ్యాచ్‌ను 21-12తో ముగించింది.

కవిప్రియ–సిమ్రన్‌కు నిరాశ
మరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. కేవలం 32 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశ
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది.

మరో జోడీ అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది.

అయితే 15వ సీడ్ భారత జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ఇంకా పోటీలో ఉంది. తొలి రౌండ్‌లో బై లభించడంతో.. రెండో రౌండ్‌లో మకావుకు చెందిన ఐక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్‌జీ జోడీతో తలపడనుంది.

ఉనతి హుడాకు రెండో రౌండ్‌లోకి ప్రవేశం
మహిళల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ఉనతి హుడా కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మయన్మార్‌కు చెందిన థెట్ హ్తార్ తుజార్‌ను 22-20, 21-16తో ఓడించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఉనతి కీలక సమయంలో రాణించి విజయం సాధించింది. ఉనతి.. తదుపరి రౌండ్‌లో 13వ సీడ్ కెనడా షట్లర్ మిషెల్ లీతో తలపడనుంది.

తొలి రోజే సంచలనం
టోర్నీ తొలి రోజే భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీపై అద్భుత విజయం సాధించి. అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా రౌండ్‌ ఆఫ్‌ 64లో సునాయాస విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది.

లక్ష్యసేన్‌ శుభారంభం
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ బల్గేరియాకు చెందిన కాలిన్స్ వాలెంటైన్ ఫిలిమోన్ను మూడు గేముల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో ఫిలిమోన్‌పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ తదుపరి రౌండ్‌లో అమెరికాకు చెందిన గారెట్ టాన్తో తలపడనున్నాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement