భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి.. 79 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి. అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నెలకు కేవలం రూ.55గా ఉన్న కనీస ప్రాథమిక వేతనం, ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000కు చేరుకుంది. ప్రస్తుతం ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు.
అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైందంటే..
1వ వేతన సంఘం 1946లో అమల్లోకి వచ్చింది. అంటే.. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే అన్నమాట. అప్పట్లో.. ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ.55గా ఉండేది.
ఆ తర్వాత 2వ వేతన సంఘం 1959లో వచ్చింది. దీంతో కనీస జీతం రూ.55 నుంచి రూ.80కు పెరిగింది.
3వ వేతన సంఘం 1973లో అమల్లోకి వచ్చింది. ఈసారి కనీస ప్రాథమిక వేతనం రూ.196కు పెరిగింది.
ఇక 4వ వేతన సంఘం 1986లో వచ్చినప్పుడు జీతాల్లో మరింత పెద్ద మార్పు కనిపించింది. కనీస ప్రాథమిక వేతనం రూ.750కు పెరిగింది.
తర్వాత 5వ వేతన సంఘం 1996లో అమల్లోకి వచ్చింది. కనీస జీతం రూ.2,550కు చేరుకుంది.
6వ వేతన సంఘం 2006లో వచ్చినప్పుడు కనీస ప్రాథమిక వేతనం రూ.7,000గా నిర్ణయించారు.
అయితే అసలు పెద్ద మార్పు 7వ వేతన సంఘం 2016లో వచ్చినప్పుడు జరిగింది. కనీస ప్రాథమిక వేతనం ఒక్కసారిగా రూ.18,000కు పెరిగింది.
7వ వేతన సంఘం ప్రత్యేకత కేవలం జీతం పెంచడమే కాదు. అప్పటివరకు ఉన్న పే బాండ్, గ్రేడ్ పే విధానాన్ని తొలగించి పే మ్యాట్రిక్స్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల ఉద్యోగుల జీతాలను ఒక కొత్త, సులభమైన నిర్మాణం ద్వారా నిర్ణయించే అవకాశం ఏర్పడింది.
ఇప్పుడు అందరి చూపు 8వ వేతన సంఘంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు ఎంత పెరుగుతాయో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 8వ వేతన సంఘంలో కనీస ప్రాథమిక వేతనం ఎంత ఉంటుందనేది ఇప్పటివరకు తుది నిర్ణయం కాలేదు. వేతన సంఘం సిఫారసులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఇదీ చదవండి: అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!


