ఆన్లైన్లో తనపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం జరుగుతోందంటూ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇంటి పేరు ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? ఆ ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా? అనే అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది.
2023లో ఆరాధ్య బచ్చన్, తన తండ్రి అభిషేక్ బచ్చన్తో కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై యూట్యూబ్లో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని వీడియోల్లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని, మరికొన్నింటిలో ఆరాధ్య మరణించిందని కూడా ప్రచారం చేసినట్లు ఆరోపించారు.
ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ.. ఒక వ్యక్తి తన ప్రతిభ, కృషి, విజయాల ద్వారా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? అలాంటప్పుడు ఆ పేరు ప్రతిష్ఠ తదుపరి తరాలకు బదిలీ అవుతుందా? అనే ప్రశ్నను అడిగారు.
తప్పుడు ప్రచారం చేశారంటూ..
ఆరాధ్య తరఫున వాదించిన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ వివాదం కేవలం ఆరాధ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. బచ్చన్ కుటుంబానికి చెందిన పేరు, ఫొటోలను ఉపయోగించి ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె మరణించిందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
ఈ కేసులో మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలని హైకోర్టు నిర్ణయించింది. కుటుంబ పేరుకు సంబంధించిన ప్రతిష్ఠ తరతరాలకు వర్తిస్తుందా? తప్పుడు వార్తలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చా? పరువునష్టం మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై విచారణ చేపట్టనుంది.


