అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనతో పాటు ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర కంపెనీ ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విత్ డ్రా (ఉపసంహరణ) చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసిన దరఖాస్తును జడ్జి నికోలస్ గరాఫిస్ ఆమోదిస్తూ తుది తీర్పు వెలువరించారు.
న్యాయమూర్తి ఈ కేసును విత్ ప్రిజుడీస్ (కేసును శాశ్వతంగా కొట్టివేయడం అని అర్థం) ప్రాతిపదికన కొట్టివేశారు. దీని ప్రకారం, ఇదే ఆరోపణలపై గౌతమ్ అదానీపై అమెరికా ప్రభుత్వం భవిష్యత్తులో మళ్లీ క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుండదు.
కేసు నేపథ్యం
2024లో భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు పొందారని, అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అత్యంత సుదీర్ఘ సమీక్ష అనంతరం ఈ కేసు ఎక్కువగా విదేశీ వ్యవహారాలకు సంబంధించినదని, కోర్టులో నిరూపించడం అత్యంత క్లిష్టమని జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. తమ ప్రస్తుత ప్రాధాన్యతల దృష్ట్యా కేసును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
I welcome the US court’s decision with humility and deep respect for the judicial process.
Throughout this challenging period, our faith in truth, fairness and the rule of law remained unwavering.
My deepest gratitude to those who never lost faith in us, in the system and in…— Gautam Adani (@gautam_adani) August 10, 2026
సత్యమే జయించింది: గౌతమ్ అదానీ
కోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘అమెరికా కోర్టు నిర్ణయాన్ని ఎంతో వినయంతో, న్యాయవ్యవస్థపై ఉన్న అత్యున్నత గౌరవంతో స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలోనూ చట్టం, సత్యం, న్యాయంపై మాకున్న విశ్వాసం సడలలేదు’ అని పేర్కొన్నారు. మరోవైపు, పౌర (సివిల్) ఆరోపణల పరిష్కారంలో భాగంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ప్రతిపాదనలకు, ట్రెజరీ విభాగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి అదానీ గ్రూప్ తగిన అంగీకారానికి వచ్చింది.


