హైదరాబాద్: డప్పుచప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. విచిత్ర వేషధారణలు.. భారీ శకటాలు.. వివిధ ఆకృతులతో ముస్తాబైన అమ్మవారి ఘటాల మధ్య పాతబస్తీ రహదారులన్నీ సోమవారం జనసంద్రమయ్యాయి.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల చివరి ఘట్టం ఆసాంతం కనులపండుగగా సాగింది. ఆయా దేవాలయాల మీదుగా సాగిన ఊరేగింపు ఢిల్లీ దర్వాజా వరకు సాగింది.
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని వేలాదిమంది భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబారిపై నిర్వహించిన అమ్మవారి ఘటాల ప్రధాన ఊరేగింపు ఆకట్టుకుంది.
హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద ఘటాల ప్రధాన ఊరేగింపును నగర సీపీ సజ్జనర్ ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.
ఆరు దేవాలయాల వద్ద మాతంగి కె.అనురాధ.. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయాల వద్ద మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పది రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బోనాలు అమ్మవారి సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ముగిశాయి.


