విజయ్‌, పీకే, అన్నామలై.. భారత రాజకీయాల్లో కొత్త గేమ్‌? | Vijay, PK and Annamalai start up moment in Indian politics; Here's Special Story | Sakshi
Sakshi News home page

విజయ్‌, పీకే, అన్నామలై.. భారత రాజకీయాల్లో కొత్త గేమ్‌?

Aug 10 2026 12:01 PM | Updated on Aug 10 2026 12:11 PM

Vijay, PK and Annamalai start up moment in Indian politics; Here's Special Story

కులం.. మతం.. కేడర్‌ బలం.. దశాబ్దాలుగా భారత ఎన్నికల రాజకీయాలను నడిపించిన ప్రధాన శక్తులు ఇవే. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయా? బ్రాండ్‌.. యువత.. టెక్నాలజీ.. సోషల్‌ మీడియా.. ప్రజలతో డైరెక్ట్‌ కనెక్ట్‌ ఆధారంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. పాత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా సొంతంగా బలం కూడగట్టుకుని.. కొత్త ఓటు బ్యాంకును తయారు చేసుకునే ప్రయోగాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఈ మారుతున్న రాజకీయ గేమ్‌లో మూడు పేర్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అవే తమిళనాడు సీఎం విజయ్‌, ప్రశాంత్‌ కిశోర్‌, తమిళనాడుకు చెందిన అన్నామలై. ముగ్గురి దారులు వేరు.. నేపథ్యాలు వేరు.. కానీ టార్గెట్‌ ఒక్కటే.. తమకంటూ కొత్త రాజకీయ మోడల్‌ను నిర్మించడం. మరి భారత రాజకీయాల్లో కొత్త గేమ్‌ నిజంగానే మొదలైందా?

సీఎం విజయ్‌.. 
తమిళనాడులో విజయ్‌ ప్రయోగం మరింత వేగంగా సాగింది. సినీ స్టార్‌డమ్‌ను రాజకీయ బ్రాండ్‌గా మార్చేందుకు తమిళగ వెట్రి కజగం ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల మధ్య కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారు. యువత, ఉద్యోగాలు, విద్య, సంక్షేమం వంటి అంశాలతో ముందుకు వెళ్లారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిందని కథనం పేర్కొంటోంది. విజయ్‌ సీఎం కావడంతో ఒక స్టార్‌ తన వ్యక్తిగత బ్రాండ్‌ను రాజకీయ అధికారంగా మార్చగలడా? అన్న ప్రశ్నకు కొత్త సమాధానం కనిపించింది.

పీకే.. 
ఇతర పార్టీలను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌.. చివరకు తనకంటూ జన సూరాజ్‌ పార్టీని నిర్మించారు. 2025 బీహార్‌ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైనా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత బంకీపూర్‌ ఉపఎన్నికలో విజయం సాధించడం ద్వారా ఓటమి తర్వాత కూడా కొత్త పార్టీని తిరిగి నిలబెట్టుకోవచ్చని చూపించారు. ఒక్క గెలుపుతో బీహార్‌ రాజకీయాలను మార్చేశారని చెప్పలేం.. కానీ కొత్త రాజకీయ స్టార్టప్‌ ఫెయిల్‌ అయితే అంతే సంగతులు కాదనే సంకేతం మాత్రం ఇచ్చారు.

అన్నామలై.. 
అన్నామలై ప్రయోగం మరో రకం. బీజేపీలో పనిచేసి ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన.. చివరకు ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ‘వీ ది లీడర్స్‌’ పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే ఎన్నికల బరిలోకి దిగకుండా.. ముందుగా సంస్థను నిర్మించడం, సభ్యత్వాన్ని పెంచడం, నాయకత్వాన్ని తయారు చేయడంపై దృష్టి పెట్టారు. అంటే ఎన్నికల ముందు పార్టీ కాదు.. పార్టీ కోసం ముందే సంస్థ అనే మోడల్‌ను పరీక్షిస్తున్నారు.

ఈ ముగ్గురిలో కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. తమ బ్రాండ్‌, తమ ఆలోచన, తమ నెట్‌వర్క్‌తో కొత్త రాజకీయ స్థావరాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అయితే కులం, మతం, ప్రాంతీయ సమీకరణాలు భారత రాజకీయాల్లో ఇంకా బలంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న సంప్రదాయ పార్టీల కేడర్‌ను సోషల్‌ మీడియా ఒక్కరోజులో భర్తీ చేయలేదు. అలాగే నాయకుడి వ్యక్తిగత బ్రాండ్‌పై ఆధారపడిన పార్టీకి.. ఆ బ్రాండ్‌ బలహీనపడితే ఏం జరుగుతుందన్నది మరో పెద్ద ప్రశ్న.

కొత్త గేమ్‌ మొదలైందా?
అందుకే పీకే, విజయ్‌, అన్నామలై ప్రయోగాలను ఇప్పుడే విజయవంతమైన కొత్త మోడల్‌గా తేల్చలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. భారత రాజకీయాల ‘గేమ్‌’లో కొత్త ప్లేయర్లు రంగంలోకి దిగారు. ఇక అసలు ప్రశ్న ఒక్కటే.. కులం.. కుటుంబం.. కేడర్‌ చుట్టూ తిరిగిన పాత రాజకీయాలకు ఇది ప్రత్యామ్నాయమా? లేక కొత్త బ్రాండ్‌తో అదే పాత రాజకీయాలకే మరో రూపమా?. మూడు ప్రయోగాలు. భారత రాజకీయాల్లో కొత్త గేమ్‌ మొదలైందా? అనే చర్చ నడుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement