మాస్కో: సముద్ర మార్గాల్లో ఎదురవుతున్న రవాణా ముప్పును అధిగమించేందుకు హిందూ మహాసముద్రానికి ఒక ప్రత్యక్ష రైల్వే కనెక్షన్ను ఏర్పాటు చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ తెలిపారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా వెళ్లే భూమార్గ కారిడార్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధి వంటి కీలకమైన వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న రవాణా ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
వార్తా సంస్థ ‘టాస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుస్నుల్లిన్ ఈ విషయాలను వెల్లడించినట్లు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. జలమార్గాల్లో ఎదురవుతున్న అంతరాయాల నుండి రష్యా రవాణా రక్షణను మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి దోహదపడుతుందని మరాత్ ఖుస్నుల్లిన్ అన్నారు. భారత్తో కనెక్టివిటీని పెంపొందించే ఏ మార్గమైనా ఆచరణాత్మకమైనదిగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ కనుక భవిష్యత్తులో రూపుదిద్దుకుంటే, రష్యా- భారత్ మధ్య నేరుగా వస్తువుల రవాణాకు ఒక ప్రత్యామ్నాయ భూమార్గ రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది.
ఈ ప్రతిపాదన సంప్రదాయ సముద్ర మార్గాలకు అతీతంగా కనెక్టివిటీని నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలిపే బోస్ఫరస్ జలసంధి, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మీదుగా భారత్కు సరుకులను తరలించడంలో మరింత వెసులుబాటును కల్పించే మార్గాలపై రష్యా పరిశీలిస్తున్నదని ఖుస్నుల్లిన్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
అయితే, తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ ల గుండా వెళ్లే ఈ కారిడార్ బహుళ దేశాల గుండా సాగాల్సి ఉంటుంది. దీనికి గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశాల మధ్య సమన్వయం అవసరమవుతాయి. ఒకవేళ ఈ ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ సాకారమైతే, ప్రమాదకరమైన సముద్ర రవాణా మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ రష్యాకు భారత్తో ప్రత్యామ్నాయ భూమార్గ రవాణా మార్గం ఏర్పాటవుతుంది.
ఇది కూడా చదవండి: ‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా?


