మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అతని భార్య, కూతురు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ సోని అనే వ్యక్తిని అతని భార్య నైనా, చిన్న కూతురు భక్తి, ఆమె ప్రియుడు విమల్ చౌదరి కలిసి హత్య చేశారు. కూతురి ప్రేమ వ్యవహారాన్ని మనోజ్ వ్యతిరేకించడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో నిందితులు పథకం ప్రకారం ఏప్రిల్ 18న మనోజ్కు మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి, బండరాయితో తల పగులగొట్టి హత్య చేశారు. అనంతరం యమునా నది సమీపంలోని అడవికి శవాన్ని తరలించి, దహనం చేసి పూడ్చిపెట్టారు.
బాధితుడి అన్న రాంబాబు ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితురాలు నైనా తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే, మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు అధికారికంగా హత్యను ఇంకా నిర్ధారించలేదు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు


