సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.
‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను.
..మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు.


