శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్ము నుంచి అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని నిర్ణయించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జమ్ము బేస్ క్యాంప్ నుంచి యాత్రను కొనసాగించే అంశంపై వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చి, యాత్ర కొనసాగించడానికి అనుకూలంగా ఉందని భావించిన తర్వాతే భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి కాశ్మీర్ లోయ వైపు ఎటువంటి కొత్త బ్యాచ్ భక్తులు బయలుదేరలేదని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. వాతావరణం మెరుగుపడి, భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే యాత్రను పునరుద్ధరిస్తామని యంత్రాంగం పేర్కొంది. భక్తులు వాతావరణ హెచ్చరికలను గమనించి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: 2011 రికార్డు బద్దలు.. ఆగస్టు మొదట్లోనే కుండపోత వర్షాలు!


