30 ఏళ్ల బస్సు సర్వీస్‌ ఒక్కసారిగా బంద్‌..! | 30 Year Old RTC Bus Service To Hanumanthapuram Suspended | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల బస్సు సర్వీస్‌ ఒక్కసారిగా బంద్‌..!

Jul 24 2026 1:54 PM | Updated on Jul 24 2026 1:55 PM

30 Year Old RTC Bus Service To Hanumanthapuram Suspended

కృష్ణాజిల్లా: గత 30 సంవత్సరాలుగా తిరుగుతున్న హనుమంతపురం ఆర్టీసీ సర్వీసును అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉయ్యూరు డిపో నుంచి వీరంకిలాకు, హనుమంతపురం, ముళ్లపూడి, ఐనంపూడి, భట్లపెనుమర్రు, పెడసనగల్లు గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు నడిపేవారు. ఉదయం 10 గంటలకు ఒక ట్రిప్పు, సాయంత్రం 4 గంటలకు మరో ట్రిప్పు ఉండేది. విజయవాడ వరకు వెళ్లే ఈ సర్వీస్ పమిడిముక్కల, మొవ్వ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడేది.

 ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన వీరంకిలాకు వెళ్లాలన్నా, వైద్యం కోసం వీరంకిలాకు, కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలన్నా ఈ బస్సు తప్ప ఆయా గ్రామాలకు ఏ విధమైన రవాణా సౌకర్యం లేదు. ఈ గ్రామాలకు కనీసం ఆటోలు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఉన్న ఒక్క బస్‌ సరీ్వస్‌ నిలిపివేయడంతో ఉదయం కాలేజీలకు, ఉద్యోగాలకు, విజయవాడ పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరేందుకు రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఇక ఆసుపత్రులకు వెళ్లే రోగుల బాధలు వర్ణనాతీతం. 

కనుమూరుకు ఎందుకు మార్చారో..?
కనుమూరు గ్రామం విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన ఉంది. ఈ గ్రామస్తుల రాకపోకలకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇటీవల కనుమూరులో రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, మంత్రి, ఆర్టీసీ చైర్మన్, జిల్లా అధికారులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కనుమూరు గ్రామంలో నుంచి వేల్పూరు, ముళ్లపూడి మీదుగా వెళ్లేందుకు కొత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సర్వీసు ప్రారంభం కాగానే హనుమంతపురం గ్రామానికి వెళ్లే బస్సును నిలిపివేశారు. రహదారి పక్కనున్న కనుమూరుకు కొత్త సర్వీస్‌ వేయడం, తమ గ్రామానికి 30 ఏళ్లుగా వస్తున్న బస్సు నిలిపివేయడమేమిటని హనుమంతపురం తదితర గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. 

ఆర్టీసీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశామని, అధికారులు అదిగో..ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకరిద్దరు అధికార పార్టీ నాయకుల స్వార్థం కోసం తమను ఇబ్బందులు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. హనుమంతపురం సరీ్వస్‌ను యథావిధిగా కొనసాగించకపోతే ఉయ్యూరు డిపో ఎదుట గ్రామస్తులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. హనుమంతపురం గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ కొడమంచిలి మహేష్‌ గ్రామస్తులతో కలిసి మంగళవారం ఉయ్యూరు డిపోకు వెళ్లి మేనేజర్‌ ప్రశాంత్‌ను కలిసి సమస్య వివరించి బస్సు సర్వీస్‌ను కొనసాగించాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వీస్‌ను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని మేనేజర్‌ హామీ ఇచ్చారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement