1987 నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. రూ.కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి-గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)
గోల్ మాల్, రక్తచరిత్ర, జర హట్కే జర భచ్కే తదితర సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించిన ఈమె.. చివరగా గతేడాది వచ్చిన 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్లో నటించింది. అయితే తనని 'మేడమ్.. మీరు ఎందుకు అలాంటి చెత్త సినిమాల్లో నటించారు?' అని ఒకరు ప్రశ్నించారని, ఆ ప్రశ్న తన జీవితంలోని బాధాకరమైన రోజుల్ని గుర్తు చేసిందని సుస్మితా చెప్పింది.
'అవి మహిళలని అవమానించే సి-గ్రేడ్ సినిమాలు. అవి పూర్తిగా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. నేను నా మనసుని అమ్ముకున్నానా? అవును.. అమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆ పని నచ్చలేదు ఇప్పటికీ నచ్చదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. 2002లో నా భర్తతో కలిసి ప్రారంభించిన ప్రయాస్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.కోటి అప్పు మిగిలింది. అదే టైంలో టెక్నాలజీ కారణంగా మా సంస్థతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి'
'అప్పు ఇచ్చినవాళ్లు తరచూ మా ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. దీంతో మళ్లీ నటిగా పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నేను సంపాదించిన ప్రతి రూపాయి అప్పు తీర్చడానికే వెళ్లేది. ఆ రూ.కోటి తీర్చేందుకు నేను, నా భర్త ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదు. పరిస్థితుల ఒత్తిడిలో తీసుకోవాల్సి వచ్చింది' అని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేసింది.
(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)


