కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ దీపక్ దాస్ గత 25 ఏళ్లకు పైగా నగరంలోని రద్దీ రోడ్లపై ఒక్కసారి కూడా హార్న్ కొట్టకుండా వాహనం నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖ కవి జీబానానంద దాస్ రాసిన కవితల స్ఫూర్తితో ఆయన ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 1990 నుంచి ప్రొఫెషనల్ డ్రైవర్గా పనిచేస్తున్న దీపక్ దాస్, కోల్కతాలో పసుపు రంగు ట్యాక్సీల నుంచి ఏసీ క్యాబ్ల వరకు వివిధ రకాల వాహనాలను నడిపారు.
రోజూ 12 గంటలకు పైగా విధులు నిర్వర్తించేవారు. ఒకరోజు మర్రిచెట్టు కింద కూర్చుని జీబానానంద దాస్ కవిత చదువుతుండగా, సమీపంలోని పాఠశాల వద్ద విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాల హార్న్ మోతలు ఆ ప్రశాంతతను భగ్నం చేశాయి. ఆ శబ్దం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. అతిగా హార్న్ కొట్టడం అనేది డ్రైవర్ల అసహనానికి అద్దం పడుతుందని ఆయన భావించారు. ఆ రోజే తన కారు నుంచి హార్న్ యంత్రాన్ని తొలగించారు. నాటి నుంచి నేటి వరకు పాతికేళ్లకు పైగా ఒక్కసారి కూడా హార్న్ ఉపయోగించకుండానే ప్రయాణం సాగిస్తున్నారు.
విపరీతమైన శబ్ద కాలుష్యం మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రీయ అధ్యయనాలు కూడా హెచ్చరిస్తున్నాయి. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వినికిడి లోపంతో పాటు రక్తపోటు, గుండె జబ్బులు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇతరులపై కోపం ప్రదర్శించడం కంటే, తోటి ప్రయాణికుల పట్ల సహనం, సానుభూతి ఉండాలని దీపక్ దాస్ నమ్ముతారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా తోటివారిని గౌరవించడం ద్వారానే రోడ్లు సురక్షితంగా మారుతాయని ఆయన నిరూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్!


