ఒకప్పుడు తమిళ సినిమాల్లో హీరోగా చేసి ప్రస్తుతం తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్.. హీరోయిన్ త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కావేరి జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు త్రిషని ఉద్దేశించి చేసినవేనని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ఈ సందర్భంగా సింగర్ చిన్మయి, నటి-రాజకీయ నాయకురాలు ఖుష్బూ.. ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. రాజకీయ విభేదాల కోసం మహిళలని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది నాకు మొదట అర్థం కాలేదు. తెలిసిన ఒకరు వివరించిన తర్వాతే అది అర్థమైంది. మొదట నేను నీటి కనెక్షన్ గురించి అనుకున్నా. చాలా మంది మహిళలకు కూడా అదే అనిపించింది. కానీ అది మహిళలని కించపరిచేలా ఉందని తర్వాత తెలిసింది. నినాదాలు చేసిన టైంలో ఎదురుగా ఉన్న జనాల్ని ఆపాల్సింది పోయి, మరింత అభ్యంతరకరంగా మాట్లాడటం నిరాశ కలిగించింది. గతంలో జయలలితపై కూడా ఇలాంటి అసభ్య వ్యాఖ్యలే చేశారని, అయితే కొత్తతరం నాయకుల నుంచి మెరుగైన రాజకీయ సంస్కృతి ఆశించామని, కానీ అది కనిపించలేదని చిన్మయి ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
ఖుష్బూ కూడా ఉదయనిధి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించింది. అసభ్యకరంగా, చౌకబారుగా, మహిళలని అవమానించేలా ఆయన స్పీచ్ ఉందని చెప్పుకొచ్చింది. రాజకీయ విభేదాలు ఉన్నాయని మహిళలని అవమానించే హక్కు ఎవరికీ లేదు. మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువుగా మార్చకూడదు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేసింది. చేసిన పనికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం ఆయనకు ఉందో లేదో చూడాలని ఉదయనిధిని ఎద్దేవా చేసింది.



