న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ టెక్ వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్కు చెందిన ‘నెట్వర్క్ స్కూల్’ను మలేషియా ప్రభుత్వం మూసివేసింది. కొత్త దేశాన్ని సృష్టించే దిశగా ఆయన ప్రారంభించిన ఈ స్టార్టప్ కేంద్రం మూడేళ్లలోపే నిలిచిపోయింది. సింగపూర్ సరిహద్దులోని జొహోర్ రాష్ట్రంలో గల ‘ఫారెస్ట్ సిటీ’లో ఈ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేశారు. అయితే లైసెన్సింగ్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ ఏడాది జూలై చివరి వారంలో దీని కార్యకలాపాలను నిలిపివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు.
సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. కానీ, గదుల్లో బూజు పట్టడం, మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం లాంటి పలు ఫిర్యాదులు వచ్చినట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అలాగే క్యాంపస్లో ఇజ్రాయెల్ జాతీయవాదులు ఉన్నారనే ఆరోపణలపై మలేషియా దర్యాప్తు జరిపింది. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.
ఈ ఆరోపణలను వ్యవస్థాపకుడు బాలాజీ శ్రీనివాసన్ ఖండించారు. ఆగ్నేయాసియాలో బూజు పట్టడం సాధారణమని, అక్కడక్కడా తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇది పార్టీలు చేసుకునే వేదిక కాదని, స్వీయ అభివృద్ధి, సాంకేతికతను నేర్చుకోవడానికి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. మలేషియాలో ఆంక్షల నేపథ్యంలో, కజకిస్థాన్లో కొత్త క్యాంపస్ను ప్రారంభించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను మలేషియా నుంచి కజకిస్థాన్కు మారుస్తున్నట్లు వెల్లడించారు. కాగా బాలాజీ శ్రీనివాసన్ సింగపూర్ సమీపంలో ఒక ప్రైవేటు ద్వీపాన్ని కొనుగోలు చేసి, ప్రారంభించిన ‘నెట్ వర్క్ స్కూల్’కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ఇది కూడా చదవండి: హిరోషిమా విస్ఫోటనం.. వెలుగులోకి నమ్మలేని నిజం!


