సోలార్‌ ప్రాజెక్ట్‌.. రైతులకు షాక్‌! | 400 MW project to be set up in Hosur on about 1800 acres | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్రాజెక్ట్‌.. రైతులకు షాక్‌!

Jul 31 2026 4:43 AM | Updated on Jul 31 2026 4:43 AM

400 MW project to be set up in Hosur on about 1800 acres

రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూమి

1,800 ఎకరాల పంట భూములు లీజుకు

600 మంది రైతులతో 30 ఏళ్ల ఒప్పందం 

రైతుల భూములపై కంపెనీకే పూర్తి హక్కు

లీజు భూములను తనఖా పెట్టుకునే అవకాశం

ఏటా ఎకరాకు చెల్లించే కౌలు నిర్ణయంలోనూ తేడాలు

ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్‌

సాక్షి, అమరావతి: సోలార్‌ వెలుగుల మాటున రైతుల భూములు లాక్కొని వారి జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న టాటా సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌పై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే గురువారం శంకుస్థాపన చేసేశారు. దీర్ఘకాలిక ఒప్పందం వల్ల తాము నష్టపోతున్నామని, పైగా రైతులందరికీ ఒకేలా కౌలు అడ్వాన్సులు ఇవ్వకుండా పక్షపాతం చూపించారని రైతులు వాపోతున్నారు. బీడు భూముల్లో కాకుండా పంట చేలల్లో ప్రాజెక్టులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూములు ఇవ్వని రైతులను వేధిస్తున్నారని, పొలాల్లోని వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా రాకుండా చేస్తున్నారని, కరెంటు స్తంభాలు సైతం పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒప్పందంలో తీవ్ర అభ్యంతరాలు..
హోసూరులో సుమారు 1,800 ఎకరాల్లో 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు పత్తికొండ మండలంలోని హోసూరు, పెద్దహుల్తి, ఆస్పరి మండలంలోని జొహరాపురానికి చెందిన సుమారు 600 మంది రైతుల నుంచి భూములను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అయితే కంపెనీకే అనుకూలంగా లీజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో రైతు­లు, సోలార్‌ కంపెనీ మధ్య కుదిరిన దీర్ఘకాలిక లీజు ఒప్పందాల్లోని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్త­మవుతున్నాయి. 

సుమారు 30 ఏళ్ల పాటు లీజు కొనసాగనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో రైతుల హక్కు­లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒప్పందంలోని కొన్ని నిబంధనలు పూర్తిగా కంపెనీ ప్రయోజనాలకు అనుకూలంగా, రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. ఒప్పంద కాలంలో రైతులు చనిపోతే వారి పొలం వారసులకు దక్కదు. కంపెనీకే సొంతమవుతుంది. ఇటువంటి నిబంధనలు అన్యాయ­మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పంద కాలాన్ని ఐదేళ్లకు కుదించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

లీజు భూములపై రుణాలు వద్దు..
లీజుకు తీసుకున్న భూములను, వాటికి సంబంధించిన ఒప్పందాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టి రుణాలు పొందేందుకు కంపెనీకి అధికారం కల్పించారు. ఈ నిబంధనలతో భవిష్యత్‌లో భూములపై తమ హక్కులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలుకు తీసుకున్న వారికి పొలం ఒరిజినల్‌ పత్రాలను ఇచ్చేయాలనే నియమం సరైంది కాదని రైతులు వాదిస్తున్నారు. 

కంపెనీ తమ భూములపై రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకులకు చెల్లించకపోతే ఆ భారం తమపైనా, తమ తరువాతి తరాలపైనా పడుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సోలార్‌ ప్రాజెక్టులను వ్యవసాయానికి పనికిరాని బంజరు భూముల్లో ఏర్పాటు చేస్తే వ్యవసాయానికి, తమ జీవనోపాధికి ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు. రైతులకు పూర్తి అవగాహన కల్పించకుండా, మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తెచ్చి తమ భూములను లీజుకు తీసుకున్నారని, దీనిపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎకరాకు రూ.50 వేల కౌలు ఇవ్వాలి
భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.50 వేలు కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కొంతమందికి ఏడాది కౌలు కింద రూ.31 వేలు, మరికొందరికి రెండేళ్లకు రూ.62 వేలు చొప్పున అడ్వాన్స్‌ కౌలు చెల్లించినట్లు చెబుతున్నారు. కూటమి నేతలు, వారి అనుచరులైన ఇంకొందరికి ఐదేళ్లు, మరికొందరికి పదేళ్ల కౌలు ముందుగానే చెల్లించినట్లు సమాచారం. ఇలా రైతులను బట్టి, వారికున్న రాజకీయ పలుకుబడిని బట్టి కౌలు చెల్లింపుల్లో తేడాలు ఉండటంతో రైతులు నిలదీస్తున్నారు. ముందస్తు కౌలును రైతులందరికీ సమంగా ఇవ్వాలని కోరుతున్నారు.

రైతుల ప్రయోజనాలు కాపాడండి..
సోలార్‌ ప్రాజెక్టుకు రైతులు వ్యతిరేకం కాదు. కానీ రైతుల భూములు, హక్కులు, భవిష్యత్‌ ప్రయోజనాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లీజు ఒప్పందంలోని నిబంధనలను బహిరంగపరచడంతోపాటు, కౌలు చెల్లింపుల్లో స్పష్టమైన విధానం అమలు చేయాలి. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలి. – కె.ప్రభాకర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement