ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోడానికి వీల్లేదు | High Court bench clarifies in capital land case | Sakshi
Sakshi News home page

ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోడానికి వీల్లేదు

Jul 31 2026 4:39 AM | Updated on Jul 31 2026 4:40 AM

High Court bench clarifies in capital land case

ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

భూ సేకరణ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే

రాజధాని భూముల కేసులో హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా, బలవంతంగా, చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తన భూమిని సేకరించే  విషయంలో ముందు­కెళ్లకుండా అధికారులను నిరోధించాలంటూ చోడిశెట్టి నిర్మలత అనే రైతు దాఖలు చేసిన అప్పీల్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందుకు సంబంధించి పిటిషనర్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన వారంలోపు తగిన నిర్ణయం వెలువరించాలని సింగిల్‌ జడ్జిని ధర్మాసనం కోరింది.  అప్పటి వరకూ ఈ భూమి విషయంలో గతంలో ఇచ్చిన ‘యథాతథస్థితి’ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.  ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, న్యాయమూర్తి జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ప్రభుత్వ దౌర్జన్యంపై హైకోర్టులో పిటిషన్‌...
అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం కోసం పెనుమాక రైతుల భూములను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యపూరితంగా, బలవంతంగా లాక్కుంటున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో తన భూమిని సైతం ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటుండటంతో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన చోడిశెట్టి నిర్మలత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలోని సర్వే నెంబర్‌ 39–2లో ఉన్న 65 సెంట్ల భూమికి సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్‌తో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ చల్లా గుణరంజన్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూ సేకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మలత ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ తిల్హరీ «నేతృత్వంలోని ధర్మాసనం, నిర్మలత భూమి స్వాధీనం విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా గురువారం ఈ అప్పీల్‌ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చింది. 

ప్రభుత్వానికి ధర్మాసనం సూచనలు
» ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా, అది చట్టానికి లోబడి జరగాల్సిందే. 
» 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది.  అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. 
» భూ సేకరణలో తీసుకుంటున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువే అయినప్పటికీ, ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండదు. 
» విస్తృత ప్రజాప్రయోజనానికి, ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనమే నిలబడుతుంది. 
» ఇతరుల దృష్టిలో ఆ ఆస్తి నష్టం ఎంత చిన్నదైనప్పటికీ, చట్ట నిబంధనల ప్రకారం ఆ ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. 
» ’చట్ట ప్రకారం’ అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు.  చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడం కూడా. 
»  ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు, నిర్దేశిత విధి విధానాలను పాటించలేదని బాధిత వ్యక్తుల తరఫు న్యాయవాది చేసిన వాదనను ఎలాంటి ప్రాధాన్యత, విలువ లేనిదిగా ఈ దశలో చూడలేము. 
» చట్ట విధి విధానాలను పాటించారా లేదా దాని ప్రభావం ఏంటన్నది బాధితులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో తేల్చాల్సిన అంశం. 
» ఈ నేపథ్యంలో అప్పీలుదారు ప్రయోజనాలను కాపాడటం సమంజమైన చర్య.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement