breaking news
Amaravati
-
పోలీస్ వాహనంలో రావణ్ తరలింపు.. కోడిగుడ్లతో జనసేన శ్రేణుల దాడి!
సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకున్నారు.పోలీసుల వాహనం ముందుకు కదలకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆగ్రహంతో ఆ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ముళ్ల కంపలు.. నీళ్ళు తోడుకోవడం తప్ప అమరావతిలో ఏ ఒక్క పనైనా చేశావా?
-
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్ఫుల్గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మూడేళ్ల ముందే జగన్ ఎలక్షన్ అజెండా.. MAVIGUN Vs అమరావతి
-
కర్నూలు జీజీహెచ్.. బాధిత కార్మికులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్ను కోరారు.వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్, ఉద్యోగాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.కాగా, వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఇటీవల పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్తో పాటు డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తి, తదితరులపై కేసు నమోదైంది. -
AP EAPCET ఫలితాలు విడుదల
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర విద్యశాఖ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 1,82,317 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు. ఏపీ ఎప్సెట్ పలితాలను జేఎన్టీయూ వీసీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో 71.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్లో తొలి ర్యాంక్ గుంటూరుకు చెందిన రోషన్ మణి దీప్ రెడ్డి( 95.69),శ్రీ కాకుకుళానికి చెందిన శ్రావ్య (95.59)కు రెండో ర్యాంక్ దక్కింది. ఇంజనీరింగ్లో టాప్ 10 మందిలో 9 మంది అబ్బాయిలే ఉన్నాయి.అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ విజయనగరానికి చెందిన జశ్వంత్ నాయుడు(92.53),రెండో ర్యాంక్ హైదరాబాద్ కి చెందిన వెంకట్ రెడ్డి(91.84) ఉన్నారు. టాప్ 10లో ఐదుగురు అమ్మాయిలు,ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ లో 89.59 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జేఎన్టీయూ వీసీ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేటాఫ్బర్త్ , క్యాప్చా కోడ్ నమోదు చేసి చూసుకోవచ్చు. స్కోర్కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు, కేటగిరీ, సబ్జెక్టులవారీగా మార్కులు, మొత్తం మార్కులు వంటి సమాచారం ఉంటుంది. స్కోర్కార్డులో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే APSCHE అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఈ ఏడాది ఏపీఎప్సెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు మే 12 నుంచి మే 20, 2026 వరకు వివిధ కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. -
చంద్రబాబు సభలో ఘోరం.. తండ్రిని ఈడ్చుకెళ్లిన పోలీసులు!
సాక్షి,నెల్లూరు: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం సభ వద్దకు చేరుకోవడంతో ఈ కలకలం రేగింది. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బాధిత తండ్రి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.నెల్లూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తౌశిక్ అనే విద్యార్థి మరణించాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం,అనుమానాస్పద పరిస్థితులే తన కుమారుడి మృతికి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అతని తండ్రి కోరుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకుని, వినతిపత్రం సమర్పిస్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు.సీఎం చంద్రబాబుకు కేవలం వినతిపత్రం మాత్రమే ఇస్తానని, దయచేసి అనుమతించాలని బాధిత తండ్రి అక్కడున్న పోలీసులను వేడుకున్నారు. అయితే, భద్రతా కారణాల నెపంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో అక్కడి నుండి తరలించారు.కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వచ్చే ఎన్నికలు మావిగన్ Vs అమరావతి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. మావిగన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్కు మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుంది. అవినీతి జరగకుండా మావిగన్ రాజధాని వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను అమరావతి వెళ్తే.. జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను నేను చెబుతున్నాను. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కాంలను ప్రశ్నిస్తున్నా. అవినీతి లేని రాజధాని కావాలనేదే చెబుతున్నా. మావిగన్కు మద్దతు ఇచ్చే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ను వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చేరుస్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టమవుతుంది. రైతులు తరఫున నేను ప్రశ్నస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
భూమి కోసం న్యాయపోరాటం
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. న్యాయపోరాటంతోపాటు కలసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లోని ఓ రైస్మిల్లులో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు, భూసేకరణకు నోటీసులు వచ్చిన రైతులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి రైతులు కూడా అంతే అవసరమని వారు పేర్కొన్నారు.బాధల్లో ఉన్నప్పుడు తమను ఓదార్చే వారిని తప్పనిసరిగా కులాలు, మతాలతో సంబంధం లేకుండా కలుస్తామని, దానిలో భాగంగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశామని రైతులు వివరించారు. సీఆర్డీఏ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని తమ కష్టాలను వివరించామని, దానికి స్పందించిన ఆయన న్యాయ సలహా కమిటీ, సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలను తెలుసుకోవడానికి వస్తున్న సమయంలో ఉండవల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి రైతులు పేర్కొన్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ పెద్దలు రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినప్పుడు 95 శాతం మంది భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూమిని వదిలివేస్తామని వారు హామీ ఇచ్చారని రైతులు వివరించారు. అయితే ఆ తర్వాత ఆ మాట తప్పి భూ సేకరణకు మూడు దఫాలుగా నోటీసులు అందజేశారని తెలిపారు. రోడ్లకు, కొండవీటి వాగుకు భూములు తీసుకుని మిగిలినవి వదిలివేస్తారా అని అధికారులను అడుగుతున్నా తమకు తెలియదంటున్నారని రైతులు పేర్కొన్నారు. ‘9.3 ఒప్పందం పత్రం ఇచ్చేదాకా ఒకలాగా మాట్లాడారు. ఇచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారు’ అని రైతులు వివరించారు. గతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు సేకరణలో లేవని, భూములు ఇవ్వడం ఇష్టంలేనివారు 9.2 పత్రాలు ఇవ్వాలని అధికారులు చెప్పారని, 9.2 ఇచ్చిన తరువాత భూ సేకరణ నోటీసులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు ఏమన్నారంటే...ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదుకిసాన్ రైతు సంఘం గతంలో రాజధాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతుందని స్పష్టం చేసింది. అలాంటిది ప్రభుత్వం 50 వేల ఎకరాలు సేకరించింది. నేను కూడా ఒక రైతునే. ఉండవల్లిలో అనేక రకాల పంటలు పండిస్తాం. 365 రోజులు పూలు, కూరగాయలు పండించి ఎవరిమీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలాంటి భూములను కాంక్రీట్ జంగిల్గా ఎలా చేస్తారు? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూలింగ్, నాన్ పూలింగ్ అని ఇచ్చారు. ఇవ్వని వాళ్లు 9.2 ఫారం ఇవ్వాలని అధికారులు కోరారు. రైతులందరం ఇచ్చాం. ఇప్పుడేమో భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉండవల్లి గ్రామాల్లో దాడిచేసే కల్చర్ ఎప్పుడూ లేదు. రైతులతో గొడవకు దిగిన ఏ ప్రభుత్వం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన 9.3ని కూడా వెనక్కి తీసుకోవాలా, ఇవ్వాలా అని ఆలోచిస్తాం. – కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి, కిసాన్ రైతు సంఘం అధ్యక్షులుమేం ఆహ్వానిస్తేనే రైతు పరిరక్షణ కమిటీ వచ్చిందిరైతుల సమస్యలపై మాత్రమే జగన్ను కలిశాం. ఆయన్ను కలవకముందే అనేక రైతు సమస్యలపై సమావేశం నిర్వహించాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసినపుడు రహదారులకు భూములు ఇవ్వాలని చెప్పారు. మిగిలిన భూమిని వదిలేసే వరకు పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా కోరిక మేరకే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటి పరిశీలనకు వస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం. ఒక రైతుగా ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. –దంటు బాలాజీరెడ్డిఆ ప్లాట్లు ఎక్కడో రైతులకు తెలియదు..తొలి విడత పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు నేటికీ ప్లాట్లు కేటాయించలేదు. పేపర్ల మీద ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు. మేము నష్టపోయినా, భూములు ఇచ్చిన రైతులు నష్టపోయినా ఒకటే. సీఆర్డీఏ అధికారులు భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి తీసుకువచ్చే ముందు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఊర్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. 2012కి ముందే మా గ్రామంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడే జరగడం లేదు. రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. –మేకా శ్రీధర్రెడ్డిమా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాంగ్రామాల్లో ఎన్ని పార్టీలు ఉన్నా, రైతులకు ఆ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా ఉంటున్నాం. దయచేసి గొడవలు పెట్టవద్దు. మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. అధికారులు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనే. నాకు సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు కేటాయించే దాకా నా పొలంలో అడుగు పెట్టడానికి వీలులేదంటూ, నా పొలం చదును చేయడానికి వీలులేదంటూ ఒప్పందం కుదుర్చుకున్నాను. 9.3 ఒప్పంద పత్రం ఇవ్వగానే ఉండవల్లిలో గ్రామసభ జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మోటారు పీకేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం లేదు. పొలానికి రెండు వైపులా 5 అడుగుల మెరక తోలారు. వర్షం వస్తే పంట మునిగిపోతుంది. నా పరిస్థితి ఏమిటి? –అనంత శివరావుప్రభుత్వమే మోసం చేస్తే ఎలా..?నాకు ఉండవల్లిలో లే అవుట్లో 7.5 సెంట్లు భూమి ఉంది. ల్యాండ్ ఫూలింగ్లో నా పేరు లేదు. భూమి అమ్మిన వారి పేరే ఉంది. ఇదేంటంటూ కమిషనర్ను కలిశాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ భూ సేకరణ కింద పెట్టారు. నోటీసు రాకుండా అభ్యంతరాలను ఎలా చెప్పాలి? కలెక్టర్ ఆఫీసుకు వెళితే మా పేరు ఉందని నా అబ్జెక్షన్ను తీసుకున్నారు. ప్రభుత్వమే ఇలా మోసం చేస్తే రాజకీయ నాయకులను ఆశ్రయించడంలో తప్పేముంది? ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. –వీరారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిపూలింగ్కు ఇచ్చాను, నాకు ప్లాట్ ఇవ్వలేదునేను మొదటి విడతలోనే పూలింగ్కు నా భూమి ఇచ్చాను. నేను 30 సెంట్ల భూమి ఇవ్వగా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. మిగిలిన భూమి ఎక్కడ ఇచ్చారనేది చూపించడం లేదు. నేను ప్లాట్లు అడిగితే గుంటూరు వెళ్లమంటున్నారు. అక్కడకు వెళితే సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. 821 మంది రైతులకు 5 విడతలుగా నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కొత్తగా భూములు తీసుకుని ఏం చేస్తారు? సీఎం నివాసం పక్కనే ఉన్నా మాకు మౌలిక సదుపాయాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమందికి పెన్షన్లు నిలిపివేశారు. మా ప్రాంతంలో రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. –కనకం కోటేశ్వరరావు -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 2,600 కోట్ల అప్పును తీసుకుంది. ఈ తాజా రుణంతో కలిపి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 25 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రం చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ. 3,55,000 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని, రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం అధికారిక బడ్జెట్ ద్వారానే కాకుండా, వివిధ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బడ్జెట్ వెలుపల కూడా భారీగా నిధులను సమీకరిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చంద్రబాబు పాలనలో జరిగిన అప్పుల అంతర్గత వివరాలు పరిశీలిస్తే.. బడ్జెటరీ అప్పులు రూ. 1,97,000 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ. 1,12,504 కోట్లుగా ఉన్నాయి. వీటికి తోడు అమరావతి పేరిట మరో రూ. 47,387 కోట్ల మేర రుణాలను సేకరించారు. -
‘వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. మేకప్ మంత్రి అంటూ తాను చేసిన కామెంట్స్కు మహిళా కమిషన్కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం మహిళా కమిషన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.నేను మహిళలను అవమానించానని టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేసింది. నేను చేసిన కామెంట్ పొలిటికల్ సెటైర్ మాత్రమే. హోంమంత్రి అనిత మా పార్టీ నేతలపై అనేకసార్లు ఇష్టానుసారం మాట్లాడారు. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మహిళా కమిషన్కు చెప్పాను.టీడీపీ, కూటమి నేతలు ఊహించున్నవాటికి సమధానం చెప్పాల్సిన అవసరం లేదు.రాజకీయంగా మీరు వంద అంటున్నారు.. మేం ఒక్కటంటే బాధ వచ్చిందా..?. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై హత్యలు, అత్యాచారాలపై హోంశాఖ ఎందుకు మాట్లాడటం లేదు.సాయికృష్ణ తల్లి బూడిద కోసం బాధపడుతుంటే ఎందుకు స్పందించరు. ఉప్పాల హారికపై దాడి జరిగితే ఎందుకు స్పందించరు?. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దారుణాలపై ఎందుకు మాట్లాడరు..?.డిప్యూటీ స్పీకర్ మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికి రారా అనిపిస్తోంది. మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి పదవి ఉంటే ఎంత?.. ఊడితే ఎంత..? అని మండిపడ్డారు.మహిళలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే.కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. -
విజయవాడ వెస్ట్ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్నగర్కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
మేము దాడులు చేయలేదు.. ఉండవల్లి రైతుల కీలక వ్యాఖ్యలు
-
భారీ స్కామ్లకు కూటమి సర్కార్ స్కెచ్
అమరావతి: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు, అధికార టీడీపీ బినామీలకు తీరప్రాంతాన్ని ధారాదత్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రేషనలైజేషన్ పేరుతో పోర్టుల పరిధిని నామమాత్రంగా తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సముద్ర తీర రక్షణ, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం పోర్ట్కు 64 కిలోమీటర్ల పరిధిని కేటాయించారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు సర్కార్ దానిని ఏకంగా 15 కిలోమీటర్లకు కుదించివేసింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 51 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రామాయపట్నం పోర్టు పరిధిని సైతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం చేస్తూ బరితెగించింది.పోర్టుల పరిధిని ఈ స్థాయిలో తగ్గించడం వెనుక టీడీపీ బినామీల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోర్ట్ సమీపంలోని అత్యంత విలువైన తీర ప్రాంతంపై కన్నేసిన టీడీపీ బినామీలకు ఆ భూములను రాసిచ్చేందుకే పరిధిని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసమే రేషనలైజేషన్ ముసుగులో ఈ భారీ స్కామ్కు పాల్పడ్డారని, దీనివల్ల పోర్టుల అభివృద్ధి దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం కానున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ సర్వీస్ నుంచి రిలీవ్
సాక్షి,విజయవాడ: సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్ను ప్రభుత్వం సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30న సూపర్ యాన్యువేషన్తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే,సస్పెన్షన్లో ఉండగానే పీవీ సునీల్ పదవీ కాలం ముగిసిపోవడం గమనార్హం.గత రెండేళ్లుగా పీవీ సునీల్పై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపునకు పాల్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టి చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. చివరికి సస్పెన్షన్ కాలంలోనే ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నుండి రిలీవ్ అయినప్పటికీ, ఆయనపై పెండింగ్లో ఉన్న వివిధ శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
దోపిడీతో అడ్డంగా దొరికిపోయారు.. అయ్యో ఇప్పుడెలా
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!
రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.ప్రపంచ బ్యాంక్కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘మేఘా’కు 300 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి అత్యంత చేరువలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద జయంతిపురంలో రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని మేఘా గ్రూపునకు కారుచౌకగా కట్టబెడుతూ చంద్రబాబు సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) గ్రూపునకు చెందిన ఐకామ్ టెలీ లిమిటెడ్ రూ.895 కోట్లతో నెలకొల్పే రక్షణ రంగ ఉత్పత్తుల యూనిట్కు చౌకగా భూములతో పాటు కీలక మౌలిక వసతులను కల్పించనుంది. సీఆర్డీఏ పరిధిలో ఉండే ఈ భూములను ఎకరం రూ.10 లక్షలు చొప్పున 300 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.నాలుగు కోట్ల పైనే పలుకుతోంది. సుమారు రూ.1,200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.30 కోట్లకే కట్టబెట్టడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఆ స్థలానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా రహదారి మార్గం కల్పించడంతోపాటు జగ్గయ్యపేట మున్సిపల్ వాటర్ స్కీం నుంచి 425 కేఎల్డీ నీటి సరఫరా, 4.25 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుంది. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద మిసైల్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్కు 300 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ అయింది. విజయనగరంలో పతంజలి గ్రూపు ఏర్పాటు చేస్తున్న హెర్బల్ పార్కుకు ఎకరం రూ.3 లక్షల చొప్పున 70 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు వెలువడింది. తొలి దశ పూర్తయితే మరో 100 ఎకరాలు ఇస్తారు.రియల్ ఎస్టేట్ వ్యాపారానికీ ప్రోత్సాహకాలు!మరోవైపు ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్కు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గృహ సముదాయాన్ని 6.11 ఎకరాల్లో ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.95 కోట్లతో మౌలిక వసతులు కల్పించనుంది. అలాగే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్కు అనంతపురం జిల్లా తిమ్మసముద్రం వద్ద 150 ఎకరాలు, నెల్లూరు దత్తులూరు వద్ద ఆండ్రోన్ సిస్టమ్స్కు 349.95 ఎకరాలు, అనంతపురం తిమ్మసముద్రం వద్ద స్పేస్ఫీల్డ్ సంస్థకు 120.76 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక -
‘చంద్రబాబుకు అమరాతి ట్రిపుల్ ఏటీఎం’
గుంటూరు: చంద్రబాబు అమరావతి ట్రిపుల్ ఏటీఎంలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు రూ.47వేల కోట్లు అప్పు చేశారు. రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గూండాల దుశ్చర్య రాష్ట్రమంతా చూసింది. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్నివేధిస్తున్నారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఏమైనా పాకిస్థానా?!.పోలీసులు, టీడీపీ దుష్టశక్తులు దాడికి బాధ్యత వహించాలి. టీడీపీ గూండాల చేతుల్లో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చెబితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు బయపడతారని అనుకుంటారా?.భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు వైఎస్ జగన్ కలిశారు. రైతులకోసం మేం వస్తే రాళ్ళు, కోడిగుడ్లతో టీడీపీకి చెందిన వాళ్లు దాడికి దిగారు. మేం బాధితులమైతే మాపైనే కేసులు పెట్టారు.బాధితులే నిందితున్నారు.నా ఇంటిపై దాడి జరిగింది... నాపైనే కేసు పెట్టారు.మీరు దౌర్జన్యం చేస్తే భయపడతామా... రైతులకోసం పోరాడతాం.మూడు పంటలు పండే భూములు తీసుకోవాలనుకుంటున్నారు. అమరావతి వ్యవహారంలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. చదరపు అడుగు నిర్మాణానికి 20వేలు ఇస్తున్నారు.ఉండవల్లి,పెనుమాక, కురగల్లు, యర్రబాలెం రైతులు మేం రమ్మంటేనే వచ్చామని చెప్పారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసుకు గాయమైతే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఎందుకింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని రిమాండ్ కు పంపించాలని పెద్ద కేసులు పెడుతున్నారు.సాయికృష్ణ లాకప్ డెత్ అంతులేని కథ.సిట్ విచారణ చేసి సీఐ నాగరాజును అరెస్టు చేశారు.రిమాండ్ రిపోర్టు చూస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి.సీసీ ఫుటేజ్ కనిపించడంలేదన్నారు.చంపడంతోపాటు సాక్షాధారాలు లేకుండా చేశారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైతే కమాండ్ కంట్రోల్ రూం, డీజీపీ ఆఫీసులో ఉండదా. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ ఘటనపై కలవాలని సిట్ చీఫ్ రవిప్రకాష్ను కోరాం.సిట్ దర్యాప్తు లోపభూఇష్టంగా జరుగుతుందని సిట్ అధికారికి ఫిర్యాదు చేశాను.సీఐ నాగరాజును బలిచెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. నాగరాజుతోపాటు అనేకమంది పైస్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. సీఐ నాగరాజు సాయికృష్ణను చంపడానికి కారణం ఏంటో సిట్ చెప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఒక్కటే చెబుతున్నా. యుద్ధంలో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. సాయికృష్ణ బాడీ అప్పగించకుండా బూడిద చెయ్యడం మానవత్వమేనా. విజయలక్ష్మి ఉసురు మీకు తగులుతుంది’ అని హెచ్చరించారు. -
రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రభుత్వ అతిధి గృహంలో బస చెయ్యాలి. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?. ఇది ప్రైవేట్ సంస్థకి దోచి పెట్టడం కాదా?. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా?. ఈ నిర్ణయం మన ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వ భవనాలను రాష్ట్రపతి వాడుకోవాలి. అవసరం అనుకుంటే భవనాలను ఆధునీకరణ చేసుకోవాలి. మన దేశం పరువు, ప్రతిష్ట ఏం కావాలి అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉందని.. మాపై కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీతో పాటు, పోలీసుల మీద కూడా దాడి జరిగింది. మా పార్టీ నేతలపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో ఆటవిక పరిపాలన చేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై హత్యా ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా కొట్టారు. ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మధ్య ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. అమరావతికి వెళ్తే తప్పేంటి?. రాజకీయ విమర్శలు చెయ్యాలనుకుంటే చేయండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు బయట పడతాయని భయంతో ఉన్నారు. అమరావతి దోపిడీని చూస్తే తప్పేంటి?. దోపిడీ కాదు అమరావతిలో జరుగుతుంది అభివృద్దే అనుకుంటే మీకు భయమెందుకు?. ప్రభుత్వం మీ చేతిలో ఉందని మా నాయకులపై కేసులు పెడుతున్నారు.మన సంస్కృతికి విరుద్దంగా చీచుల్లో బార్లు పెడుతున్నారు. ఎయిర్పోర్టుల్లోనూ ప్రభుత్వం బార్లు ఓపెన్ చేస్తున్నారు. విదేశీ సంస్కృతి వేరు.. మన సంస్కృతి వేరు. బార్లు పెట్టడమే సంపద సృష్టా?. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం సబ్సిడీ మీద మామిడి కొంటుంది. మీరు దేనికీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అన్ని పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అనే నాడుడి బాబు సార్ధకం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట నష్టపోయేది రైతులే. మీకు ఓటేసిన పాపానికి ఇదేనా మీ పాలన. కూటమి నేతలు మాట్లాడితే అవి సూక్తులు.. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ సమయం ఆసన్నం అయ్యింది. విశాఖలో విలువైన భూములన్నీ పప్పు బెల్లల్లా పంచేస్తున్నారు. ఉపాధి కల్పన ఎక్కడా లేదు. భోగాపురం ఎయిర్పోర్టుకి దారి లేదు.. నీరు లేదు. అలాంటి విమానాశ్రయంలో బారు పెడతా అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే మళ్ళీ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మా నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి రైతులు వారి సమస్యలు మాకు చెప్పుకున్నారు. అమరావతి రావాలని ఇబ్బంది పడ్డ రైతులే ఆహ్వానించారు. ‘మావిగన్’ మా విధానం అని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అట్రాసిటీ కేసు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పీఎస్లో మరో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.టీడీపీ నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు.ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. -
గుంటూరు కలెక్టర్ను కలిసిన రాజధాని రైతులు
సాక్షి, గుంటూరు: గుంటూరు కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవను కలిసిన రాజధాని రైతులు.. బలవంతపు భూ సేకరణపై వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. సీడ్ యాక్సిస్ రోడ్లకు భూములిచ్చి సహకరించామని.. భూ సేకరణకు మాత్రం తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరచడం.. అంతేగానీ పెద్దపెద్ద భవనాలు నిర్మించడం కాదన్నారు.‘‘మా భూములు బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మా ఊర్లో 3 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజేషన్పై మా అభ్యంతరం చెప్పాం. మేము భూములు ఇవ్వం. ఉండవల్లి రైతులను పరామర్శించడానికి వచ్చే వారిపై దాడులు చేయడం దారుణం’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు, ఇసుక మాఫియా.. రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పరామర్శించకుండా పరిరక్షణ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. -
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ గూండాల దాడి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు, ఇసుక మాఫియా.. రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను పరామర్శించకుండా పరిరక్షణ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. అయితే, రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి అధికారులు కొండవీటి వాగు నీళ్లు వదిలారు. సదరు రైతుల పొలాలను పరిశీలించడానికే ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలు వారిని అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు. పచ్చ గూండాల దాడిలో పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. -
ఆస్పత్రిలో ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.ముద్రగడ అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.ఈ సందర్భంగా నాయకులు ఇద్దరూ ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును అక్కడి వైద్యులను అడిగి ఆరా తీశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే. -
సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజుకు తోడైన ముగ్గురు కిరాతకులు వీళ్లే!
సాక్షి,విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలను వెలికితీశారు. సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది.సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలతో పాటు సీఐ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐ అసిస్టెంట్గా హెడ్ కానిస్టేబుల్ అశోక్ వ్యవహరించగా.. మరో హెడ్ కానిస్టేబుల్ నాని సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్మెంట్లు, దందాలు నడపడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.గతంలో గన్నవరం, పటమట పోలీస్ స్టేషన్లలో పని చేసినప్పుడు నానిపై అనేక ఆరోపణలు రావడంతో అతడిని వీఆర్కు పంపారు. అయితే, ఇటీవలే మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్గా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. సీఐ సన్నిహితుడైన సురేష్.. సాయికృష్ణ మృతదేహాన్ని లొకేషన్ నుండి మాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్ను ఒక సెటిల్మెంట్ విషయమై సురేష్ పిలిచాడు. ఆ తర్వాత సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు కలిసి ఒక నల్లటి రంగు వాహనంలో వడ్డేశ్వరంలోని నవరంగ్ ఇంటికి వెళ్లారు. నవరంగ్ ఇంటికి వెళ్లి వారు చేసిన హడావుడి, బెదిరింపుల అంశాన్ని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్వయంగా సిట్ అధికారుల విచారణలో వెల్లడించారు.సాయికృష్ణ మృతదేహాన్ని దాచడంలో లేదా వేరే చోటికి తరలించడంలో ఈ ముగ్గురూ సీఐ నాగరాజుతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, ప్రైవేట్ వ్యక్తి సురేష్ల కోసం సిట్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. -
టీటీడీ ఆన్లైన్ టికెట్ల బుకింగ్.. సాంకేతిక లోపాలపై భక్తుల అసంతృప్తి
సాక్షి,తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే సామాన్య భక్తులకు ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టీటీడీ అధికారిక పోర్టల్ ద్వారా ప్రతి నెల విడుదలయ్యే వివిధ రకాల దర్శన కోటాలు, ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్ సమయంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఓ శ్రీవారి భక్తుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆన్లైన్ టికెట్లు విడుదలయ్యే సమయానికి ముందే వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ అయి, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామని వాపోయారు. స్లాట్లు ఓపెన్ అయిన మరుక్షణమే ‘వర్చువల్ క్యూ’లోకి పంపుతున్నారని, అక్కడ నిమిషాల తరబడి నిలబడి మొబైల్ నంబర్ ఓటీపీలు ఎంటర్ చేసి, భక్తుల వివరాలు నమోదు చేసే లోపే పరిస్థితి మారిపోతోందని ఆవేదన చెందుతున్నారు.చివరకు పేమెంట్ ఆప్షన్కు వెళ్లేసరికి ‘స్లాట్ ఆల్రెడీ బుక్డ్’ అనే సందేహం మాత్రమే స్క్రీన్పై దర్శనమిస్తోందని భక్తులు వాపోతున్నారు. సామాన్యుడికి అందని ద్రాక్షేనా?ఈ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై భక్తులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ఆన్లైన్ టికెట్లు సామాన్య భక్తులకు నిజంగానే దొరుకుతున్నాయా? లేక కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నవారికి, వ్యవస్థ వేగాన్ని అందుకోగల సాంకేతిక నిపుణులకు మాత్రమే లభిస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.భక్తి, అదృష్టం, ఇంటర్నెట్ స్పీడ్ ఈ మూడింటిలో ఏది ఉంటే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో భక్తులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కోటా విడుదలైన 20 నుండి 30 నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు మాయమవ్వడం వెనుక కారణాలను విశ్లేషించాలని, సాధారణ భక్తుడి సమయానికి, శ్రమకు కనీస విలువ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.దళారుల ప్రమేయం లేకుండా, అందరికీ సమానమైన, పారదర్శకమైన రీతిలో దర్శన అవకాశాలు కల్పించే నూతన విధానాన్ని టీటీడీ ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. స్వామివారి సన్నిధికి రావాలని కోరుకునే ప్రతి భక్తుడికి న్యాయం జరిగేలా గోవిందా అని పిలిచే భక్తుల బాధ ఆలయ బోర్డు అధికారుల వరకు వినబడేలా టీటీడీ తక్షణమే స్పందించి ఈ ఆన్లైన్ సర్వర్ సమస్యలను, బుకింగ్ లోపాలను సరిదిద్దాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు -
పులివెందులలో వైఎస్ జగన్కు బ్రహ్మరథం
సాక్షి,వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందుల పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఆయన పర్యటన అడుగడుగునా అభిమానుల కేరింతలు, కోలాహలం మధ్య సాగింది. జనం భారీగా తరలిరావడంతో ఆయన పర్యటన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా నడిచింది.వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు భూమయ్యగారిపల్లె చేరుకున్నారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఇటీవల మృతిచెందిన భూమయ్యగారిపల్లె మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.భూమయ్యగారిపల్లె నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందులకు వైఎస్ జగన్ బయలుదేరగా, దారిపొడవునా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభిమానుల తాకిడి కారణంగా మధ్యాహ్నం 12 గంటలకే పులివెందుల చేరుకోవాల్సిన ఆయన వాహనం, సాయంత్రం 4:30 గంటలకు కానీ అక్కడికి చేరుకోలేకపోయింది.దారిలో ప్రతి ఒక్కరి వద్ద ఆగుతూ, అందరినీ పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. కుర్రాళ్ళు ఆయన వాహనం వెంట నడవగా, సెల్ఫీల కోసం యువత ఉర్రూతలూగారు. ప్రతి ఒక్కరికీ సెల్ఫీలు ఇస్తూ ఆయన ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో బాకరాపేటలో ఒక చిన్నారికి వైఎస్ జగన్ స్వయంగా ఓనమాలు దిద్దించి, అక్షరాభ్యాసం చేయించారు.సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన వ్యక్తిగతంగా కలిశారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. -
ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు
సాక్షి,విజయవాడ: కేబినెట్ సమావేశంలో కూటమి సర్కార్ రాష్ట్ర పరిపాలన, ప్రజా సేవలు, విద్యా రంగం, వైద్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంది.వాటిల్లో ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై నియోజకవర్గంలో అసైన్డ్ భూములపై నిర్ణయాధికారాన్ని ఎమ్మెల్యేల కమిటీలకు అప్పగించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను కమిటీ ఛైర్మన్లుగా నియమించనున్నారు. దీంతో అసైన్డ్ భూములపై తుది నిర్ణయాలు కూటమి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ ప్రభావం, పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.గీతం యూనివర్సిటీలో 45 మీటర్ల ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణానికి ఫైర్ ఎన్ఓసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన విధించింది. ఈ నిర్ణయం విద్యా రంగంలో అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నప్పటికీ, భద్రతా ప్రమాణాల అమలు కఠినంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆస్పత్రులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ఆస్పత్రులే భరించాలని నిర్ణయించింది. 8 శాతం వడ్డీని ఆస్పత్రులే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని, దీని ప్రభావం రోగులపై పడవచ్చని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ కరెన్సీ నోటుపై అభ్యర్థనతో రాసిన వింత లేఖ వెలుగులోకి వచ్చింది.ఆలయ అధికారులు,స్థానిక భక్తుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారుఅయితే ఆ వింత లేఖ రాసిన సదరు మహిళ ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయికి చేరితే.. చివరికి ఎవరికీ చెప్పుకోలేక ఇలా నేరుగా భగవంతుడికే తన ఆవేదనను నివేదించుకుందనే కోణంలో సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, హుండీ లెక్కింపులో దొరికిన ఈ రూ. 20 నోటు తాలూకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం సమాజంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో భక్తులు తమ వ్యక్తిగత బాధలను, దేవాలయాల లోపాలను హుండీ లేఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం పెరిగిపోతోందని, ఇటీవల కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలోనూ ఇలాంటి వింత లేఖలే బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించే వరకు తాము హుండీలో ఒక్క రూపాయి కూడా వేయం’ అని భక్తులు స్పష్టం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయి, హుండీని వేదికగా చేసుకుని భక్తులు డిమాండ్లతో కూడిన వినూత్న నిరసన లేఖలు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. -
సాయికృష్ణ కేసులో కీలక మలుపు
సాక్షి,విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు. ఈ విచారణపై సమాచారం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ దైవప్రసాద్... కృష్ణలంక పోలీస్ స్టేషన్కు టాస్క్ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని పిలిపించుకున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్లో ఏసీపీ దైవప్రసాద్తో పాటు ఆయన నేతృత్వంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం లతాకుమారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్హెచ్ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. -
కొడుకు గురించి అడిగితే.. ఫొటోకు దండ వేసుకోమంటారా?: వైఎస్ జగన్
సాక్షి,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ సాయి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయి అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి:‘‘ విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే చంద్రబాబు నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీపరిధి. ఇదే పరిధిలోనే ఈ పోలీసు స్టేషన్ ఉంది. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోదిస్తున్న దృశ్యం. ప్రతీ ఒక్కరినీ ఒకటో ఆలోచన చేయమని అడుగుతున్నా.చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. ఇదే పోలీసు స్టేషన్ కమిషనరేట్, ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఇది.మే నెలలోనే రెండు ఘటనలు:మే మాసంలో ఒక ఘటన కాదు. సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్ అనే మరో పిల్లాడిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది.‘నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు:ఆరోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’.. అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి ప్రతీ రోజూ తనకు సమాచారం అందే కొద్దీ, ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్దమై అదే పోలీసు స్టేషన్ కు ప్రతీ రోజూ వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.సాయికృష్ణను చంపినట్లు ఒప్పుకున్నారు:అప్పుడు కచ్చితంగా నా కొడుకుకు ఏదో జరిగిందని ఆ తల్లికి అర్దమై జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. నా కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని పిటిషన్ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐని సస్పెండ్ చేశారు. ఆ సీఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పగలరా? చంపేశాడనే కదా సీఐని సస్పెండ్ చేసింది. అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే ఆ సీఐ పరిధిలోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్ ను కాపాడుతూ డీజీపీ.. మొత్తం అందరికీ తెలిసి స్టేషన్లో జరిగిన ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ, కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని, వీడియో ద్వారా తన మెసేజ్ ను తెలియజేసిన పరిస్ధితి. నేను ఒకటే చెప్తున్నాం. సస్పెన్షన్ అంటే ఏంటి?. టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే హత్య చేస్తే, గోళ్లు పీకి చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా?:ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే.. ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్ ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది. ఆ పిల్లాడి వయసెంత 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో కొద్దో గొప్పో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని సమన్ చేసింది. వీళ్లు చేయాల్సింది ఏంటి ? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సిన పని. ఆ పిల్లాడు తప్పు చేసాడా, లేదా అన్నది ఆర్గుమెంట్ చేసి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది.సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే:కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమైన పరిస్ధితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పోలీసు అధికారులు వీళ్లకు వత్తాసు పలుకుతుంటే, సీఐ దగ్గరి నుంచి, ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తురుపు చర్యలు చేపట్టి కేవలం సస్పెన్షన్ తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది. ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీదు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం డిలే జరిగింది, సస్పెన్షన్ మాత్రమే చేసి టెంపరరీగా ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇది ఒక్కరితో కాదు, సిస్టమేటికా జరుగుతున్న ఈ క్రై మ్ లో సీఐ ఒక్కడే కాదు ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్ అయి ఉన్నారు. అందుకే సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.అసలు ఏ చర్యా లేదు.కేవలం కంటితుడుపు మాత్రమే:ఇదంతా ఎంత కంటితుడుపు చర్య అంటే, అసలు యాక్షనే తీసుకోలేదు. మే 9వ తారీఖు నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్ లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారంటే, ఏ విధంగా వీళ్లంతా క్రై మ్ ను బయటికి రాకుండా చేస్తున్నారో, ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్ ఛార్జ్ లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట. కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్ అయి ఈ క్రై మ్ చేయించారని కనిపిస్తా ఉన్న పరిస్ధితుల్లో ఓ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్లు ఎంక్వైరీ చేయడానికి బాధ్యత అప్పగించారంట. అంటే ఏ రకంగా వీళ్లు లా అండ్ ఆర్డర్ తో చెలగాటం ఆడుతున్నారు, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం.అందుకే సీబీఐ దర్యాప్తు కావాలి:నేను ఒకటే చెప్తున్నాను. ఇది కచ్చితంగా సీబీఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సీఐ దగ్గరి నుంచి ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి ఎలా కాపాడుతున్నారు, ఎందుకు రోటీన్ పద్ధతిలో ఇలాంటి లాకప్ డెత్ లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ రావాల్సిందే ’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. వెలుగులోకి వీడియో
సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్లో సాయికృష్ణను పోలీసులు కొట్టారని, ఈ దారుణాన్ని తానే ప్రత్యక్షంగా చూశానంటూ మహంకాళి చందు అనే యువకుడు వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. సాయిని లాకప్లో దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు నేను చూశాను. నేను లాకప్లో ఉన్నప్పుడే చిత్ర హింసలు పెట్టారు.అరెస్ట్ చేస్తే కోర్టులో పెట్టాలి. కానీ 6 టౌన్ పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. ఆ రోజు సాయితో వచ్చినవాళ్లందరిని బయటకు పంపించారు. ఎందుకు బయటకు పంపించారు. సాయిని ఏం చేయాలని పంపించారు’అని ప్రశ్నించారు. -
ఏపీలో చాలా దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. క్యాలెండర్ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు. మనం రాకముందు ఎలా ఉండేవి? గత వైఎస్సార్సీపీ పాలనను వైఎస్ జగన్ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం. వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం. కురుపాలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్ ఇచ్చేవేకావు.. జగన్కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపుమరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు. రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్ జగన్ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు. -
‘సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి.కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు.హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.సాయికృష్ణ మృతికి పోలీసులే కారణంసాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి.పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్.. ఎంక్వయిరీ వేయండి.మనం మానవులు అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్డెత్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు. అనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడారు. నవరంగ్, సాయి కృష్ణ మేనమామ సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టే న్యాయం చేయమని అడుగుతున్నాం.సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు.వంగవీటి నరేంద్రమానవతా దృక్పధంతో స్పందించాం.వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి.హోంమంత్రి... సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు. -
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్
సాక్షి,కాకినాడ: దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీహెచ్ అగ్రహారంలో చిన్నారి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అందులో తాను 40 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటలో చిన్నారి దాటిన కంచె వద్ద రెండు ఆట బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఈ బొమ్మలు అక్కడ కట్టిందెవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. వందల ఎకరాలు గాలింపు చర్యల్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ ఎంతవరకు చేశారనేది నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ బొమ్మల్ని కంచెకు కట్టినట్లు తెలుస్తోంది. ఈ బొమ్మలపై స్పష్టత రావాల్సి ఉండగా.. జ్ఞానేశ్వరి తల్లి భవానీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. జూన్ 6న తుని సమీపంలోని చిన్న అగ్రహారం గ్రామంలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. పోలీసులు విస్తృతంగా శోధన చేపడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి సుంకర భవానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. మీడియా ఎదుట ఆమె ఏడవకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘కెమెరా ముందు ఏడవడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఆమె వాపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు తనను మనోవేదనకు గురి చేస్తున్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి తల్లి మాట్లాడుతూ.. జనం సూటి పోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. నిందలు వేయడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. సోషల్ మీడియాలో కామెంట్లు మనో వేధనకు గురి చేస్తున్నాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా పరిష్కారం కాని పరిస్థితిలో, కుటుంబం ఆందోళనతో పాటు సోషల్ మీడియా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది.ప్రస్తుత జ్ఞానేశ్వరి కేసు వివరాలుజ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు అదే కుటుంబానికి చెందిన పెట్ డాగ్ కూడా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది కానీ అసాధారణ ప్రవర్తన చూపించింది. పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. కానీ కుక్క ఆరోగ్యం క్షీణించి జూన్ 13న చికిత్సలో మరణించింది. దీంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు,ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.అడవి జంతువుల ప్రమేయం ఉందేమో తెలుసుకోవడానికి మాంసంతో నింపిన బొమ్మలను పొలాల వద్ద అమర్చారు. కుటుంబ సభ్యులు, పొరుగువారు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పామాయిల్ తోటల్లో ట్రాక్టర్లతో గడ్డిని తొలగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను బయటకు పంపుతున్నారు. -
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు
సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం (జూన్ 15) ఎస్ఐఆర్లో పలు సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ సీఈవోకి లేఖ ఇచ్చారు.అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు. -
అమరావతిలో దేవుడి భూములకు ఎసరు.. పల్నాటి వీరులను వదల్లేదు?
సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల కేటాయింపుపై మరోసారి వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలంలోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన భూములను దేవాలయానికి తిరిగి కేటాయించాల్సి ఉండగా, వాటిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారు.వివరాల ప్రకారం.. తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 161లో సుమారు 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమరావతి భూసమీకరణ (Land Pooling)లో భాగంగా తీసుకున్న అధికారులు, అనంతరం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను దేవాలయానికి కాకుండా ఇతరులకు కేటాయించారు. దేవాలయ భూములకు సంబంధించి ఫామ్-8 రికార్డుల్లో "నో ట్రాన్స్ఫర్" అనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయి. ఈ భూములకు బదులుగా రావాల్సిన 21 రిటర్నబుల్ ప్లాట్లు దేవాలయానికి అందకుండా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లపై నమోదు చేశారు.ప్రస్తుతం ఈ ప్లాట్ల విలువ రూ.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పల్నాటి వీరుల దేవాలయ నిర్వహణ, నిత్యకైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం దాదాపు ఆరు దశాబ్దాల క్రితం దాతలు ఈ భూములను దానం చేసినట్లు సమాచారం. అలాంటి భూములకు సంబంధించిన హక్కులను విస్మరించి కేటాయింపులు చేయడం దేవాదాయ ఆస్తుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల వెలగపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు పల్నాటి వీరుల దేవాలయ భూముల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?
సాక్షి,విజయవాడ: ఉర్సా భూముల వ్యవహారంలో కేశినేని సోదరుల మధ్య మాటలు మంటలు కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం వైజాగ్ ఉర్సా భూముల కుంభకోణంపై కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాటి ఫిర్యాదుపై ఇప్పుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుపై కేశినేని నాని సోసల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫ్రస్టేషన్తోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారు. ప్రశ్నించినందుకు నాపై 14 నెలల తర్వాత కేసు పెట్టారు. తాను లేఖ రాసినందుకే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని అన్నారు. డీల్ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు. ఉర్సా భూముల కుంభకోణంవైజాగ్లో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని కేశినేని నాని గతేడాది ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కేశినేని చిన్ని, తన స్నేహితులు, బినామీలతో కలిసి కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరే. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ఈ ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. దగాపడ్డ రైతులు, మహిళలు, పిల్లలు ఇలా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు. ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. -
కేంద్ర నివేదికతో చంద్రబాబు అవినీతి బట్టబయలు..!
-
అమరావతిలో మరోసారి బయటపడ్డ బాబు కోట్ల దోపిడీ..
-
అమరావతిలో మరోసారి బయటపడ్డ ఏపీ ప్రభుత్వ దోపిడీ
న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ దోపిడీ మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో చంద్రబాబు బండారం బయటపడింది. అమరావతిలో కేంద్ర సర్కారు సెంట్రల్ కాంప్లెక్స్ను నిర్మించనుంది. అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. ఉద్యోగ నివాసాలకు చదరపు అడుగుకు రూ.3,945 నిర్ధారించింది. మొత్తం 23.25 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం కోసం 1,299 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం మొత్తం 31.3 లక్షల చదరపు అడుగులకు 1,235 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. చదరపు అడుగుకు 5 వేల రూపాయలలోపే ఖర్చు చేయనుంది.చంద్రబాబు సర్కార్ మాత్రం.. కేంద్ర సర్కారు అమరావతిలో ఇంత చవకగా బిల్డింగులు కడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం ఎందుకు చదరపు అడుగుకు 20 వేల ఖర్చు చేస్తుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు 20 వేల రూపాయలపైనే ఖర్చు చేస్తోంది. కేంద్రం కట్టే బిల్డింగుల ఖర్చు కంటే చంద్రబాబు సర్కార్ ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. -
కాపురాలు కూలిపోతున్నాయి
తాడేపల్లి రూరల్: ‘మాకున్న కొద్దిపాటి భూముల్లో ఆడపిల్లలకు కట్నం కింద కొంత రాసిచ్చాం. ఆ భూముల్ని రాజధాని కోసం బలవంతంగా తీసేసుకుంటున్నారు. దీనివల్ల మా బిడ్డల కాపురాలు కూలిపోతున్నాయి’ అని కొందరు రైతులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీకేంటండీ నెలనెలా జీతాలొస్తాయి. మాకు ఈ భూములే ఆధారం. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాలి’ అని మహిళా రైతులు నిలదీశారు. అమరావతి ముఖద్వారమైన ఉండవల్లిలో సీఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గ్రామసభకు రైతులు ర్యాలీగా వెళ్లారు. తమ వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్, భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ‘మా భూమి.. మా హక్కు’ అని నినదిస్తూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 1990 ముందు నుంచే ఉండవల్లిలో పండే పంటలను, ఎగుమతులను, భూముల విలువను సీఆర్డీఏ అధికారులకు వివరించారు. కట్నం కింద రాసిచ్చాం పలువురు రైతులు మాట్లాడుతూ తమకున్న భూముల్లో కొంత ఆడపిల్లలకు కట్నం కింద రాసిచ్చామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో కౌలు రూ.20 వేలకు మించి ఎక్కడా లేదని, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో మాత్రం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు వస్తుందని వివరించారు. ‘నాలుగు పంటలు పండే ఈ భూములను ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే అదే తరహాలో పంటలు పండే భూములను రైతులకు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి’ అని అధికారులకు వివరించారు. మహిళా రైతులు మాట్లాడుతూ ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలని నిలదీశారు. ‘రాజధాని ప్రకటించినప్పుడే ఉండవల్లి పంచాయతీ పాలకమండలి, తాడేపల్లి మండల పరిషత్ పాలకమండలి రాజధానికి భూములు ఇచ్చేదిలేదని నిర్ధారించాయి. రాజధాని 29 గ్రామాల్లో ఇక్కడున్న రైతులకు చాలామందికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను మొదటి విడతలో పూలింగ్కు ఇచ్చాం. ఈ భూమి ఇవ్వలేదంటే అధికారులు అర్థం చేసుకోవాలి’ అని రైతులు కోరారు. పన్నెండేళ్లుగా ఏం అభివృద్ధి చేశారు ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులు మాట్లాడుతూ.. ‘మా భూములు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చాం. మా గ్రామం అభివృద్ధి చెందలేదు. 12 సంవత్సరాలుగా గ్రామ పరిస్థితి దారుణంగా ఉంది. వెంటనే అభివృద్ధి చేయాలి. ఉండవల్లిలో ఎత్తిపోతల పథకంతో పాటు ఎందుకూ ఉపయోగపడని ప్రాజెక్టులు పెడుతున్నారు. మా గ్రామంలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో 12 ఏళ్ల క్రితం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. ‘కొంతమందికి ఉండవల్లిలో గజాల కింద పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో గజాల కింద 10–15 మంది ఉన్నాం. మాకు గజాల కిందే ప్లాట్లు ఇస్తామని చెప్పి అధికారులు మోసం చేశారు’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించినా.. పంట నాశనం చేశారు గ్రామ సభ జరుగుతుండగా ఉండవల్లి గ్రామానికి చెందిన శిగిరిశెట్టి అనంతశివరావు కన్నీరు పెట్టుకుంటూ వచ్చి ‘సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరిస్తానని చెప్పి 9.3 పత్రాన్ని అందజేశాను. దాన్ని ఆసరాగా తీసుకుని పొలంలో పంట ఉండగా దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు తీసివేసి పైపులైన్లు పీకివేశారు’ అంటూ కాంట్రాక్టర్ల దౌర్జన్యాన్ని వీడియోలో చూపించారు. తన పొలంలో పైపుల్ని దౌర్జన్యంగా తొలగించి.. తనను పూర్తిగా నాశనమయ్యేలా చేశారని శిగిరిశెట్టి అనంత శివరావు కన్నీటిపర్యంతమయ్యారు. ఉండవల్లిలోని సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు ఏ సమస్య మీద వెళ్లినా అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ చులకన భావనతో మాట్లాడుతున్నారని, తమ భూములు తీసుకుంటూ మమ్మల్ని ఏసీలు వేసి కూర్చోబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెల్లి కాపురం చెడిపోయేలా ఉంది మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లి. మా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఒక ఎకరం మా చెల్లికి కట్నంగా ఇచ్చాం. అది రిజిస్ట్రేషన్ కావడం లేదు. వారి కాపురం చెడిపోయేలా ఉంది. రాజధానికి భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్లు ఆపి, బెదిరించి పొలాలు తీసుకుంటారా? మాకు వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి మా ఆడపిల్లల కాపురాలు నిలబెట్టండి. – జొన్న సాంబశివరావు, రైతుఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మా ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. మీతో మాట్లాడుతుంటే ఏడుపు వస్తోంది. ఆ భూమిని నమ్ముకుని ఇప్పటిదాకా జీవించాం. మా ఆడపిల్లలకు మీరు ఇచ్చే అరకొర భూమితో ఎలా పెళ్లిళ్లు చేయాలి. మీరు దయవుంచి మా భూములు వదిలివేయాలి. మీరు ఇచ్చే భూముల్లో వ్యవసాయం ఎలా చేయగలం? – శింగంశెట్టి అనుపమ, రైతుదేవదాయ రైతుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి మా తాతలు, తండ్రుల కాలం నుంచి దేవదాయ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. ఉన్నట్టుండి ఆ భూములను సీఆర్డీఏ అధికారులు దున్నేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని భూముల్ని ఇప్పటికే దున్నేశారు. దానివల్ల కౌలు రైతులం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మాకూ రాజధానిలో బతికేందుకు అవకాశం కల్పించాలి. ఆ భూములను లాక్కుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలి? – దాసరి నాగరాజు, కౌలు రైతు ఉండవల్లిని విలన్గా చూపిస్తున్నారు ఉండవల్లిలో భార్యాభర్తలిద్దరూ ఒక ఎకరంలో వ్యవసాయం చేస్తే నెలకు రూ.60 వేలు సంపాదిస్తారు. కౌలు రైతు కూరగాయలు, పూలు, ఇతర పంటలు పండించి నెలకు రూ.45 వేలు సంపాదిస్తున్నాడు. ఏదో విజయవాడకు దగ్గరగా ఉందని పూలింగ్కు ఇవ్వనని అనడం లేదు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. సమాజంలో ఉండవల్లిని రాజధానికి విలన్గా చిత్రీకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. – జంగాల సాంబశివరావు, రైతుముందొక మాట.. తరువాత ఒక మాట రాజధాని వల్ల మా ఇంటిని కోల్పోయాం. మాకు సీడ్ యాక్సెస్ రోడ్లో 26 సెంట్లు ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్కు అవసరం అంటే మాకు గజాల్లో స్థలం ఇస్తామంటే మా భూమి ఇస్తామని చెప్పాం. ముందు ఇస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు సెంట్లు ఇస్తామంటున్నారు. ఇప్పటికే వయసు పైబడి చేతులు వణుకుతున్నాయి. మా అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్లం దానిపైనే ఆధారపడుతున్నాం. మాకు గజాల్లో స్థలం ఇప్పించండి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – శ్రీనివాసరావు, రైతు -
గేర్ మార్చిన రాధాకృష్ణ.. అమరావతి గుట్టు బట్టబయలు..
-
వైఎస్ జగన్ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాడ్యం పట్టుకుంది అర్దం అవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాలలో అవసరం ఉన్నా,లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం , రైతులపై దౌర్జన్యం చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఉండవల్లి ,పెనుమాక ,నిడమర్రు మొదలైన గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను కొంతమేర ఇచ్చారు. ఆ పైన ఇవ్వడానికి సిద్దపడడం లేదు. కొందరు భూమలు వదలుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో రైతులపై చంద్రబాబు సర్కార్ వేదింపులు మొదలుపెట్టింది.బాధితులైన రైతులు కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులపై జరుగుతున్న దాష్టికాన్ని ఎదుర్కోవడానికి న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇది టిడిపి మీడియాకు నచ్చలేదు. వెంటనే ఒక స్టోరీ అల్లేశారు. దానిలో జగన్ పైన, బాధితులపైన తప్పుడు రాతలు రాశారు. జగన్ ను కలిసినవారిలో కొందరు ఆయన సామాజికవర్గం వారని అంటూ ఎల్లో మీడియా కులం ప్రస్తావన చేసింది. అంటే ఏమి అనుకోవాలి?అమరావతికి మద్దతు ఇస్తే తప్ప, లేకుంటే ఎవరిపైన అయినా కుల ముద్ర, లేదా మరో ముద్ర వేసి ప్రచారం చేస్తారా?. ఈ కధనం చదివినవారికి ఏమనిపిస్తుంది.ఒక సామాజికవర్గ ఆధిపత్యం కోసమే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలను రాజధాని కోసం ఎంపిక చేసి, లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్దమైందన్న ఆరోపణలు ,విమర్శలు వాస్తవమే అన్న భావన కలగదా!అప్పట్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసి రాజధాని గ్రామాలలో అత్యధికంగా భూములు కొనుగోలు చేసినవారిలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వారి లబ్ది కోసం ఎల్లో మీడియా ఇలా దిగజారి వార్తలు రాస్తున్నదన్న అభిప్రాయం కలగదా?నిజానికి ప్రస్తుతం రాజధాని రైతులంతా కులాలతో సంబందం లేకుండా అంతా అవస్థలు పడుతున్నారు.2015లో ఉత్సాహంగా భూములు ఇచ్చినవారు సైతం నిస్పృహకు గురి అవుతున్నారు.మంత్రి నారాయణ పాల్గొన్న ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మరణించారు. అప్పుడు ఇదే ఎల్లో మీడియా కూల్ గా పడిపోయి మరణించారని దిక్కుమాలిన రాతలను రాసింది.ఆయన కూడా జగన్ సామాజికవర్గానికి చెందినవారేనా! అంతెదుకు రాయపూడి ప్రాంతంలో ఒక ప్రముఖ రైతు నేత తన భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్లలేదా!ఆయన ఏ కులం వారు?రాజకీయంగా పలుకుబడి,పరపతి, అధికారం ఉన్నవారికి మాత్రమే ఇబ్బంది లేని చోట్ల ప్లాట్లు కేటాయిస్తున్నారని, మిగిలినవారికి వరద ప్రాంతాలు,స్మశానాలలో సైతం ప్లాట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఓపెన్ గానే వస్తున్నాయి.బాధ పడుతున్నవారిలో చాలా మంది కమ్మవారు కూడా ఉన్నారు కదా!వారికి మాత్రం ఏమి న్యాయం జరిగింది?రెండో టరమ్ లో అధికారం వచ్చి రెండేళ్లు అయినా ఇంతవరకు ఎంతమందికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇచ్చారో చెప్పగలరా?రెండో దశ పూలింగ్లో వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్దం అయితే వ్యతిరేకిస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నది కమ్మ సామాజికవర్గం కాదా?అంతెందుకు! రెండో దశ కింద వేల ఎకరాలు సేకరించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించిన రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు ఏ సామాజికవర్గంవారు? అమరావతి నిర్మాణం పేరుతో రైతులను దోచుకుంటున్నారని, అదనంగా భూములు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కమ్మ వర్గం వారు కాదా?వాస్తవ పరిస్తితి ఇలా ఉంటే అదేదో రెడ్డి సామాజికవర్గం వారు కొంతమంది రాజధానికి అడ్డుపడుతున్నట్లు దుర్మార్గంగా వార్తలు ఇస్తారా?ఇవన్ని ఎందుకు!ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిని ఒక సామాజికవర్గ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని గతంలో ఆరోపించారా?లేదా?ఆయన స్వయంగా పెనుమాక ప్రాంత రైతులను కలిసి వారి గోడు అప్పట్లో విన్నారా?లేదా?ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు.అది వేరే సంగతి. ఇది అసలు కుల సమస్యకాదు. కులాలకు అతీతంగా వేలాది మంది రైతుల ఆక్రోశం.ఆవేదన.ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా వ్యవహరించడంపై వ్యక్తం అవుతున్న నిరసన అని గమనించాలి.భూములు ఇచ్చినవారిపై అక్కసుతో ఉండవలసిన అవసరం జగన్ కు ఏమి ఉంటుంది.వారికి ప్లాట్లు ఇవ్వవద్దని, డ్రైన్లు, కరెంటు,తదితర సదుపాయాలు కల్పించవద్దని జగన్ ఏమైనా అన్నారా?వారికి కూడా న్యాయం చేయమనే కదా కోరింది.ఇన్నివేల ఎకరాలు తీసుకోవడం,లక్షల కోట్లు రాజధాని పేరుతో వ్యయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.అందులో ఆక్షేపణ ఏమి ఉంది?అందుకే మచిలీపట్నం ,విజయవాడ,గుంటూరు కారిడార్ ను (మావిగన్) ప్రతిపాదించి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి లక్షల కోట్ల వ్యయం అవ్వదని ఆయన సలహా ఇచ్చారు.ఆ ప్రతిపాదన చేయడం వల్లే కదా ప్రభుత్వం భయపడుతోంది. టిడిపి మహానాడులో అమరావతికి సంబందించి చర్చను ఎందుకు విస్తృతంగా చేయలేదు?రెండు లక్షల ఎకరాలు తీసుకోవలసిన అవసరం, లక్షల కోట్ల నిధులు ఒకే చోట వ్యయం చేయడం ఎందుకు అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారే!ఈ నేపధ్యంలో కొందరు రైతులు జగన్ ను కలిసి తమను ప్రభుత్వం ఏ రకంగా హింసిస్తుందో వివరించారు. రైతుల భూములలో వారి అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవచ్చా?ప్రభుత్వమే ఇలా రౌడీయిజంగా వ్యవహరించవచ్చా?పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూములలో ప్లాట్లు వేయవచ్చా?వేరేవారికి ఆ ప్లాట్లు కేటాయించవచ్చా?అది చట్ట సమ్మతమా?ఒక సాధారణ రైతు ప్రభుత్వమే తన భూమిని ఎలా కబ్జా చేస్తుందని, ఐఎఎస్ అధికారులు అందులో వేరేవారికి ప్లాట్లు ఎలా రిజిస్టర్ చేస్తారని,ఇదేనా వారు చదువుకుంది అని ప్రశ్నించారు.తన పొలంలోకి కొండవీటి కాల్వకు గండి పెట్టి నీరువదలిలారని ఒక రైతు వాపోయారు.తాను కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చినా, ఇంకా భూమి కావాలంటూ వెంటబడుతున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.విశేషం ఏమిటంటే పెనుమాకలో జరిగిన గ్రామ సభలో కొందరు తెలుగుదేశం మద్దతుదారులు కూడా భూములు ఇచ్చిన తమకు జరుగుతున్నఅన్యాయాలను ఏకరువు పెట్టి అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చశారు.వారిలో రెడ్డి వర్గం వారు కూడా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సి.ఎమ్ గా ఉన్నప్పుడు పోలవరం ఎడమ కాల్వ తవ్వకానికి భూములు సేకరిస్తే,టిడిపికి చెందినవారు కొన్ని చోట్ల అడ్డుపడ్డారు.వారు కోర్టుకు వెళ్లారు.వీరిలో ఎక్కువ మంది ఏ కులం వారో అప్పుడు రాశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించిందా?అదే రైతులు టిడిపి అధికారంలోకి వచ్చాక ఒక రేటుకు ఒప్పందం అయి భూములు ఎలా ఇచ్చారు?ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది.అదేదో నేరం అయినట్లు విష ప్రచారం చేయడం దారుణం. సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం రౌడీయిజం చేయడమే మంచి విధానం అన్నట్లు ఎల్లో మీడియా రాయడం అంటే అంతకన్నా నీచం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు గుట్టు రట్టు.. రైతులకు టోకరా పెట్టి నారా బ్రాహ్మణి పేరుతో భూములు
-
‘పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్ లీవల్ను వన్ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్ ఆర్డర్ పని చేసే ఒక్కో పోలీస్కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్ అండ్ డ్రైవ్లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.ప్రతి పీఎస్ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్ నిండినవారిని ఏఆర్కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్ జగన్ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు. -
నారా బ్రాహ్మణి పేరుతో ల్యాండ్.. కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని దందా..
-
సర్కార్ మాటలు నమ్మం.. ఏకతాటిపైకి రైతులు
-
చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. లాబీయింగ్ చేసే వారికే అవకాశాలుంటాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.రాజ్యసభ సీటు రాకపోవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అలకబూనారు. సోషల్ మీడియాలో శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిని వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపించింది. కష్టపడిన నేతలకు గుర్తింపు లేదంటూ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. కాగా, ఇటీవలే ఆయనకున్న పోలిట్ బ్యూరో సభ్యుడి పోస్ట్ తీసేసి జోనల్ కో ఆర్డినేటర్ స్థాయికి తగ్గించింది. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026 -
మునిగిపోతుందని తెలిసినా అమరావతి నిర్మాణం చేపట్టారు..
-
స్క్వేర్ ఫీటు.. ‘హై’రేటు
సాక్షి, అమరావతి: రాజధానిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) ప్రాంతంలో ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్టాప్ ఎలివేషన్ కోసం ప్రీకాస్ట్ పిన్స్ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్స్టేషన్, వాటర్ బాడీస్ వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మరో రూ.547.07 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను డిజైన్, బిల్డ్ లంప్సమ్ విధానంలో టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అనుమతిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978లకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు(బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్ను పోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించింది. రూ.924.69 కోట్ల నుంచి రూ.2,027.76 కోట్లకు..హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.ఇక ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ(హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ(సీసీ టీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.547.07 కోట్ల మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టుకు కొత్తగా 86,500 చదరపు మీటర్లు(9,31,078.25 చదరపు అడుగులు)లో రూ.800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. అంటే.. సుప్రీం కోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 (రెట్టింపు) చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కేసులు సుప్రీం కోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఎంతకు చేరుతుందో? రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదు
సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.లిక్కర్ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు గతంలో లిక్కర్ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
అమరావతి భవనాల హంగులకు భారీ వ్యయం
సాక్షి,విజయవాడ: అమరావతిలో ఇప్పటికే భారీ వ్యయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు భవనాల హంగుల కోసం మరోసారి వందల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు సంబంధిత పనులకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.సూపర్ బ్లాక్ ఎఫ్లో ఉన్న హైకోర్ట్ భవనం వద్ద అదనపు వసతుల కోసం రూ.540 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్ స్టేషన్, బ్యూటిఫికేషన్ పనులు ఉన్నాయి.అదే విధంగా, రాయపూడి ప్రాంతంలోని ఐఏఎస్ అధికారుల నివాస భవనాలకు కూడా హంగులు జోడించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లలో హంగుల కోసం రూ.94 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పనుల్లో స్టోర్ రూమ్స్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టెయిర్కేస్, బాల్కనీ విత్ కెనేపీ, పార్కింగ్ వసతులు వంటి అంశాలు ఉన్నాయి.ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణానికి భారీ నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ నిధులు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. -
బీచ్లలో మద్యం అమ్మకాలు.. ఆమోదం తెలిపిన చంద్రబాబు సర్కార్
సాక్షి,అమరావతి: గత ఎన్నికల్లో ‘సంపద సృష్టిస్తా..పేదలకు పంచుతా..’ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల పెంపుపై దృష్టి పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కేబినెట్ సమావేశంలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్లో అన్ని బీచ్లలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం బీచ్లలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తోందని, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
మునిగిపోయిందన్న మునిగిపోయింది, పేర్ని నానితో రైతు సరదా సన్నివేశం
-
మా భూములు మావి కాదా అన్నా.... వ్యవసాయం తప్ప.. కంట తడి పెడుతున్న రైతులు
-
బాబుకు బిగ్ షాక్.! మావిగన్ కి జై కొడుతున్న రాజధాని రైతులు
-
జగన్ ముందు బాబు చిట్టా విప్పిన రైతు.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు..!
-
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది
-
మరో భారీ అప్పు చేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. జూన్ నెల మొదటి మంగళవారమే ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చింది. తాజా అప్పుతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3లక్షల 44వేల 494 కోట్లకు చేరాయి. ఫలితంగా చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక బాబు సర్కార్ గడిచిన 24 నెలల్లో రూ.3,44,494 కోట్లు అప్పు చేసింది. వాటిల్లో బడ్జెటరీ అప్పులు రూ.లక్షా 85వేల కోట్లు, బడ్జెట్ బయట రూ.1,15,504కోట్లు అప్పులు చేసింది. అమరావతి పేరుతో రూ.47,387కోట్ల అప్పులు ఉన్నాయి. -
LIVE : అమరావతి రైతులతో వైఎస్ జగన్..
-
భయపడకండి మీకు నేనున్నా... అమరావతి రైతులకు జగన్ హామీ
-
అమరావతి రైతులతో YS జగన్ భేటీ
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం
-
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదంనెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు తెప్ప బోటులో నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
53 వేల ఎకరాల్లో కట్టుకోండి మేమైతే భూములు ఇవ్వము
-
వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అన్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.ఎక్కువ మందిని కనాలా? పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు కీర్తిస్తున్నాడు. ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు. -
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
కూటమి ప్రభుత్వంపై కోర్టుకు వెళతాం.. అమరావతి రైతులు సంచలన నిర్ణయం
-
హక్కుల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటం
తాడేపల్లి రూరల్: డిమాండ్లు పరిష్కరించకుండానే రాజధానికి భూములు సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కులను పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ ఆదివారం రాత్రి తాజాగా సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశాల్లో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకుని అటు తర్వాత బాయ్కాట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. రైతులను బెదిరించడానికి కేసులు పెడతారని, ఆస్తులు ధ్వంసం చేస్తారని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని కూడా రైతులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వైద్యులు కన్నారావు నాయుడు, రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కళ్లం సంజీవరెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు.. తీవ్ర నిరసనకు సంసిద్ధం గ్రామసభ నిర్వహించేందుకు 15 రోజుల ముందే ప్రతి ఒక్క రైతుకు నోటీసు అందజేయాలి. 29వ తేదీ గ్రామసభ అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ అధికారికంగా నోటీస్ ఇవ్వలేదు. ఉండవల్లిలో 1,100 ఎకరాలు ఉంటే అందులో బడా బాబులు, వ్యాపార వేత్తలు 230 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చారు. 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఉండవల్లిలో అంగుళం భూమి కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 870 ఎకరాల్లో సుమారు 1,500 మంది రైతులు ఉన్నారు. గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి అందరూ వస్తే వేలాదిమంది అవుతారు. తద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తీవ్ర నిరసన తెలియజేయాలి. విభజించి.. పాలించుచంద్రబాబు సర్కార్ వైఖరిపై ధ్వజం ఉండవల్లిలో వెయ్యిమంది రైతులకు దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని కొంతమంది రైతులను మభ్యపెడుతున్నారు. అక్కడ ఉన్నది 200 ప్లాట్లు అయితే వెయ్యిమందికి ఎలా ఇస్తారో రైతులు ఆలోచించుకోవాలి. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని రాజధాని రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం, కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని మనం తిప్పి కొట్టాలి. ఉండవల్లిలో అధికారిక రిజి్రస్టేషన్ వ్యాల్యూ ప్రకారం చూసినా ఎకరం రూ.5 కోట్లకు క్రయ విక్రయాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక గ్రామంలో ఎక్కువగా ఎంత మొత్తంలో రిజి్రస్టేషన్ జరిగితే దాని ప్రకారం అవార్డు ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు వెళినా, రైతులకు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా న్యాయం జరగాలి. రాజధాని ప్రాంతంలోని ఒక గ్రామంలో రైతులకు 2018లో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఆ రైతులకు మొత్తం రూ.9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది. గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపిస్తున్నారు ఇటీవల ఒక గ్రామంలో జరిగిన సభలో గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపించారు. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకు ఎలా తెలుస్తుంది? తమకు ప్లాట్లు కేటాయించడంలో, అభివృద్ధి చేయడంలో ఎటువంటి న్యాయం జరగలేదంటూ సీఆర్డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్లాట్ల పత్రాలతో బ్యాంకు లోన్కు వెళితే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. వ్యవసాయం లేక, ఇచ్చే అరకొర కౌలు చాలక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే బడా సంస్థలకు భూములు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు కేటాయించడం లేదని ప్రశి్నంచడంతో అధికారులు మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి.కొన్ని గ్రామాల్లో సభలను వాయిదా వేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఉండవల్లి భూములు గతంలోనే చాలా విలువైనవి అంటూ మాట్లాడుతూనే ప్రతి అంగుళం భూమిని భూ సేకరణ కింద తీసుకుంటామని చెబుతున్నారు. అధికారులు నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి మినిట్స్బుక్లో రాసుకుంటున్నారు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదు. ఈ సమావేశంలో మున్నంగి వీరశ్రీధర్రెడ్డి, మున్నంగి అంజిరెడ్డి, దండమూడి సాంబశివరావు, గోపాలం ప్రభాకరరావు, దంటు బాలాజీ, దాసరి నాగేశ్వరరావు, ఆళ్ళ వాసు, గాదె నాగరాజు, బుర్రముక్కు పద్మారెడ్డి, కోటేశ్వరరావు, అశోక్రెడ్డి, సందు చినబసవయ్య, సింగంశెట్టి మనోహర్, గోపాలం ప్రభాకర్, ఉండవల్లి అశ్వని, కొప్పోలు శంకరరావు, తమ్మా శ్రీనివాస్రెడ్డి, జొన్న శ్రీను, గోపాలం వాసు, మోదుగుల శ్రీను, జొన్న శివశంకర్, పాల కోటేశ్వరరావు, పెద్దిశెట్టి వీరాస్వామి, గుంటక నరేష్రెడ్డి తదితర రైతులు, నేతలు పాల్గొన్నారు. -
ఆగని బాబు దుబారా ఖర్చులు
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్కి వెళ్లనున్నారు.ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్లు సింగపూర్ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోతఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.కర్నూలు జిల్లాకర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లారంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.నంద్యాల జిల్లాడోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. -
ఏపీలో మండుతున్న ఎండలు
సాక్షి,అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరు జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దక్షిణ కోస్తా జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాపట్లలో సాధారణం కంటే ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధికారులు మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించారు. -
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
-
బాబు అమరావతి స్కాం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే...!
-
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్స్టార్ హోటల్స్కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
అమరావతికి రాష్ట్ర ఖజానా నిధులు విడుదల చేసిన బాబు సర్కార్
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి రూ.2,100 కోట్లు సీఆర్డీఏకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు అమరావతి కోసం మొత్తం రూ.4,100 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుదేలైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.47,000 కోట్ల రుణాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి నిధులు విడుదల చేయడం ప్రజల డబ్బు వృథా అవుతోందన్న విమర్శలకు దారితీస్తోంది.గతంలో అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’గా అభివర్ణిస్తూ, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పటివరకు వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల డబ్బు అమరావతికి పెట్టబోమని చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు నిధులు విడుదల చేయడంపై ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి అమరావతికి నిధులు కేటాయించడం ఆర్థికపరంగా సరైన నిర్ణయం కాదన్న చర్చలు కొనసాగుతున్నాయి. -
అమరావతిలో తేడా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గమనించారు.. అందుకే జై ఆంధ్ర అంటున్నాడు
-
అమరావతి పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ ముఖం చాటేస్తున్నాడు
-
మద‘గజం’ సర్కారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లిలో భూ సేకరణకు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. మదగజంలా జనావాసాలపై పడుతోంది. ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది రైతుల భూములనూ భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లిలో 280 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. మరికొందరికి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ ప్రకటన కూడా ఊరుపేరు లేని పత్రికలతోపాటు, ఇక్కడ దొరకని ఆంగ్ల దినపత్రికల్లో ఇచ్చారు. ఇంటికి నోటీసు వచ్చే వరకూ ఈ సమాచారం తెలియనీయకుండా సీఆర్డీఏ అధికారులు జాగ్రత్త పడ్డారు. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి భూసమీకరణకు ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. గత 12 ఏళ్లుగా భూములు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కక్ష సాధింపుగానే తమకు భూసేకరణ నోటీసులు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజాల్లోకి మార్చిన ఇళ్లస్థలాలు, ఇళ్లకూ భూసేకరణ నోటీసులు ఇచ్చారు. గజం రూ.70వేలు పలికే భూములు లాక్కునేందుకు బాబు సర్కారు పన్నాగం పన్నింది. బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందులపాలే... అమరావతి రోడ్డులో ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్లే దారిలో కుడివైపున ఉండవల్లి దేవాలయం భూముల వద్ద ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి ఐదు ఎకరాల్లో అనుమతులతో ఇళ్లు నిరి్మంచుకున్నారు. గుంటూరు చానల్ నుంచి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మరొక 10 ఎకరాలు 30 మంది నుంచి 40 మంది రైతుల చేతిలో ఉంది. ఎడమచేతి వైపు పంటపొలాల్లో గతంలో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటి పక్కన ఉన్న కొన్ని పొలాలను గజాల్లోకి మార్చుకున్నారు. వాటినీ భూసేకరణలో పెట్టడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి గుహల ఎదురుగా 2014కు ముందు వెంచర్ వేశారు. ఆ వెంచర్లో సుమారు 50 మంది రెండు నుంచి మూడు సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు అక్కడ కూడా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ప్రాంతంలో గతంలోనే ఇళ్లు కట్టుకున్న వారు తమను గ్రామ కంఠంలో కలపాలంటూ అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ భూములకూ నోటిఫికేషన్ ఇచ్చారు. పెనుమాక గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వెనుక పంట పొలాల్లో నివాసాలు ఉన్నాయి. పక్కనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలం ఉంది. అదే రైతుకు కొండవీటి రిజర్వాయర్ ఏర్పాటుచేసే దగ్గర మరో ఎకరం ఉంది. ‘ఆ ఎకరం పూలింగ్కు ఇస్తాను, ఈ భూమిని వదిలేయండి’ అని రైతు అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కొండవీటి వాగు వెడల్పు, మరికొన్ని రోడ్ల నిర్మాణం కోసం కొన్ని నివాసాలు తొలగించాల్సి వస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచి్చన వారికి ప్లాట్లు ఇవ్వలేదు, ఇళ్లు కూడా తొలగిస్తే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు తమవారికి కట్టబెట్టేందుకే బాబు సర్కారు ఈ దురాగతానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారుఇప్పటికే ఆరు ఎకరాల భూమిని అభివృద్ధి కోసం తీసుకున్నారు. మళ్లీ భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారు. మా భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ల్యాండ్ పూలింగ్కు ఇస్తామని ఎన్ఓసీ తెచ్చుకోవాలట. ఇదెక్కడి అన్యాయం. – ఎం.ఉమామహేశ్వరరెడ్డి, రైతు, ఉండవల్లిప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలి ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి. క్షేత్రస్థాయిలో వాస్తవికతను అర్థం చేసుకోవాలి. నాకు కేవలం 1.60 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు మొత్తం ఇచ్చేయమంటున్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. మళ్లీ ఇదొక సమస్యగా మారింది. – పి.వెంకటరెడ్డి, రైతు, ఉండవల్లి పోరాటానికి సిద్ధం చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తే అదిరేదిలేదు. న్యాయబద్ధంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏమీ పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో టీడీపీ సర్కారు మమ్మల్ని దారుణంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. – దశరథరామిరెడ్డి, రైతు, ఉండవల్లి -
అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో మాత్రం దూసుకెళ్తూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతోపాటు, బడ్జెట్ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో రూ.4,600 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లు కాకుండానే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,40,494 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్ అప్పులే రూ.1,80,603 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,504 కోట్లకు చేరాయి. మరో పక్క రాజధాని అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యంగా ఉంది. అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్ సిక్స్తో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకుండానే రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలం అయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు రెండేళ్లు కాకుండానే రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేసినా, ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు. రాష్ట్ర సంపదగానీ, ప్రజల సంపద గానీ పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు. -
నీలం సంజీవరెడ్డికి వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ సీఎం నీలం సంజీవరెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి..లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి.. భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం.నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత… pic.twitter.com/ACFVKQHcEN— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2026 -
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
సాక్షి,ఢిల్లీ: కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించింది. అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.అమరావతి నిర్మాణం కోసం రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు ఇవ్వడంతో కొరత ఏర్పడింది. ఈ ఆదేశాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి లేఖ రాశారు. కేంద్రం వార్నింగ్తో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలను రద్దు చేసింది.కాగా, గత నెలలో ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాలని నిర్ణయించింది.కూటమి సర్కార్ చర్యలతో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా ఆ అంశానికి సంబంధించి తన తప్పును కూటమి సర్కార్ ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించారు మనోహర్.అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.పెట్రోల్ ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాందేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి, వాటిపై ట్యాక్స్ను ఎత్తివేసే ఆలోచన ఏమైనా ఉందా’? అంటూ నాదెండ్ల మనోహర్ని మీడియా అడగ్గా.. . ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు.ప్రజలు పెట్రోల్, డీజిల్ను ఆదా చేసేలా ఉండాలని ప్రధాని పిలుపునిస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా.. ‘‘ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు, దీనిపై ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు’’ అని సమాధానమిచ్చారు. -
ఇంకెంత పెరగాలి బాబుగారూ?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ98.63, డీజిల్ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ111.36(హైదరాబాద్), డీజిల్ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్ రూ.104.66, డీజిల్ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్కు సూచిస్తున్నారు.తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్ ₹112.96, డీజిల్ ₹100.32 -
బలవంతపు భూసేకరణ చేస్తే.. కలెక్టరేట్లో ఉరి వేసుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: బలవంతంగా తమ భూములు లాక్కుంటే కలెక్టరేట్లోని చెట్టుకు ఉరి వేసుకుంటామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి రైతులు హెచ్చరించారు. రాజధాని భూసేకరణ నుంచి ఉండవల్లి గ్రామాన్ని తొలగించాలని కోరుతూ పెద్దఎత్తున రైతులు సోమవారం గుంటూరు కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ సాయికాంత్ వర్మ వారికి హామీ ఇచ్చారు. అనంతరం రాయపూడిలోని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుకూ రైతులు వినతిపత్రం ఇచ్చారు.తాము రాజధానికి వ్యతిరేకం కాదని, మా తాత ముత్తాతల నుంచి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసం భూ సమీకరణ, భూసేకరణలకు వ్యతిరేకంగా 12 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనార్థం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామన్నారు. అమరావతి రాజధానికి కావాల్సినంత భూమి సీఆర్డీఏ వద్ద ఉందని, అందులో నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని రైతులు సూచించారు.మాకున్న కొద్దిపాటి భూమిని కుటుంబ సభ్యులు పంచుకుంటే వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుందని, ఈ భూమిని సీఆర్డీఏకి ఇస్తే వారు తిరిగి ఇచ్చే ప్లాట్ల పరిమాణం ఏమాత్రం సరిపోదని.. అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టంచేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. తాము 12 ఏళ్లుగా భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కక్షగట్టి భూసేకరణకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే 280 మందికి నోటీసులు ఇచ్చారని, ఊరు పేరులేని పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి రైతులకు సమాచారం తెలీకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.మార్టీపై ఎందుకీ కక్ష?మేం చిన్న సన్నకారు రైతులం. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే భూములిచ్చాం. ఇప్పుడు మళ్లీ భూసేకరణ అంటూ బెదిరిస్తున్నారు. ఉన్న ఎకరాన్ని కూడా ఇవ్వాలంటున్నారు. మాకు వ్యవసాయం తప్పితే మరో పని తెలీదు. ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందనుకోలేదు. ఏం జరిగినా మేం భూములిచ్చే ప్రసక్తే లేదు. – టి. సంజీవరెడ్డి, ఉండవల్లిరైతులకు ప్రభుత్వం ఏమేలు చేసిందో చెప్పండి మా భూమిని అన్నం పెట్టే తల్లిలా భావిస్తున్నాం. దీనిని లాక్కుంటామంటే ఎలా? ఈ రెండేళ్లలో రైతులకు కూటమి ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పండి? పైగా ఇప్పుడొచ్చి భూములపై పడుతున్నారు. నాకు కేవలం అర ఎకరా పొలమే ఉంది. దీనిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేదిలేదు. – జి. బుసిరెడ్డి, ఉండవల్లిరిజిస్ట్రేషన్లు చేయడంలేదు.. మా భూములకు రిజిస్ట్రేషన్లు కూడా చేయడంలేదు. ల్యాండ్ పూలింగ్కు భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వం రైతులను బెదిరిస్తోంది. పిల్లల చదువుల కోసం భూమి పత్రాలు పెట్టి అప్పు తీసుకుందామన్నా అవకాశంలేకుండా చేస్తున్నారు. ప్లాట్ ఇచ్చేదెప్పుడు? అది అమ్ముడుపోయేదెప్పుడు? అప్పటి వరకూ మేం పిల్లల చదువును ఏం చేయాలి. – ప్రభాకర్, ఉండవల్లిఅధికారంలోని వారు ఏం త్యాగం చేస్తున్నారు? అభివృద్ధిని అడ్డుకోవడం రైతుల అభిమతం కాదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే అర ఎకరం భూమిచ్చా. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమినీ ఇప్పుడు ఇచ్చేయమంటున్నారు. అధికారంలో ఉన్న వారు అమరావతి రాజధాని కోసం ఏమాత్రం త్యాగం చేస్తున్నారో చెప్పాలి. – పి. పోతిరెడ్డి, ఉండవల్లిప్రభుత్వం విధానం మార్చుకోవాలి.. కులమతాలకు, పార్టీలకతీతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అర్ధంచేసుకోవాలి. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజేషన్ ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇప్పటికే కొండవీటి వాగు కోసం భూమి ఇచ్చాం. రైతులను బెదిరించే ధోరణికి స్వస్తి పలకాలి. – ఎం. శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి -
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
-
APSRTC చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ నిర్వహణ విషయంలో ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ తప్పనిసరి అని అంటున్నారాయన. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఆర్టీసీలోని పదివేల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాల్సి ఉంది. పదివేల విద్యుత్ బస్సులు కొనాలంటే 17 వేల కోట్లు కావాలి. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీపై ఆర్ధిక భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఖర్చు చేసి బస్సులు కొనే పరిస్థితిలో ఆర్టీసీ ఇప్పుడు లేదు అని అన్నారు. ‘‘కొత్త బస్సులు కొనలేం. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే మేలు. మొత్తం 1050 ఎలక్ట్రికల్ బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. రెండు మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ప్రతీ రోజు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్ కు వెళుతుంటాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి’’ అని కొనకళ్ల నారాయణ అన్నారు. -
వర్షం వస్తే మునిగిపోయే రాజధాని నాసిరకం నిర్మాణాలు
-
అమరావతి పనుల్లో నిర్లక్ష్యం.. ఒరిగిన స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు
-
అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..
వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన, కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి వైనం అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు పంటలు పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత పటిష్టంగా ఉంటే ఏమి చేసుకున్నా ఎవరూ కాదనరు,కాని ఒక పక్క చెప్పిన హామీలకు డబ్బులు లేవని పదే,పదే వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.ఎకరా 20 కోట్లు ఉందని ఆయన ప్రచారం చేస్తున్నారు కాని, తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్ రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపం..
తాడేపల్లి రూరల్: అమరావతి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయి. 20 రోజులుగా ఈ బ్రిడ్జి పూర్తిగా పడిపోకుండా అధికారులు క్రేన్ను అడ్డంపెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధానికి అతి ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా బకింగ్హామ్ కాలువ–కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లుగా చెబుతున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తాయి.స్టీలు బ్రిడ్జి ఏర్పాటు చేసే సమయంలో రెండు పిల్లర్ల మధ్య నిర్మించిన గడ్డర్లు ఒక పక్కకు వాలిపోయాయి. అవి పడిపోకుండా క్రేను అడ్డంపెట్టిన అధికారులు.. గురువారం వాటిని తొలగించే పనులు చేపట్టారు. రాజధానికి, 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డును ఉండవల్లి వరకు నిర్మించారు. ఇక్కడి నుంచి ఉండవల్లి సెంటర్ బకింగ్హామ్ కెనాల్ మీదుగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే బ్రిడ్జిని దాటిస్తూ మణిపాల్ ఆస్పత్రి వరకు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మంగళగిరి – ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ను దాటిస్తూ అనుమతులు లేకపోయినా తాత్కాలికంగా రూ.68 కోట్లతో స్టీలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.బకింగ్హామ్ కెనాల్లో నీటి ప్రవాహానికి అడ్డురాకుండా ఆ చివర, ఈ చివర నాలుగు పిల్లర్లు ఏర్పాటు చేసి మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి.. ప్రకాశం బ్యారేజ్కి దక్షిణం వైపు బిగించిన స్టీలు గడ్డర్లు వంకర పోయి ఒరిగిపోయినట్లు సీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. గతనెల 20వ తేదీన స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింత ఒరగకుండా భారీ క్రేన్తో గడ్డర్ను నిలబెట్టారు. ఇంజినీర్లు పరిశీలించి.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గడ్డర్లు తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని చెప్పారు. కానీ, రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చులు.. ప్రజలకు మాత్రం పొదుపు పాఠాలు
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్లో చంద్రబాబు కొత్త ప్రచారం ప్రారంభించారు. విచిత్రమేమిటంటే, పర్యటనల పేరుతో, ఢిల్లీలో తన ఇంటి కోసం చేస్తున్న దుబారా ఖర్చులను మరిచిపోయిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతోంది. కానీ సీఎం, మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘నాదేశం -నా బాధ్యత’ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. జిల్లా పర్యటనల్లో ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్, వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అని ప్రకటించింది.విచిత్రం ఏంటంటే కేబినెట్ నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదు. దుబారా తగ్గించాలంటూ కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నీతులు చెప్పారు. ఆ తర్వాత మంత్రి పార్ధసారధి సైతం ఇకపై ప్రత్యేక విమానల్లో ప్రయాణాలుండవని తెలిపారు. అలా మంత్రి పార్ధసాధి చెప్పారో లేదో కొద్ది సేపటికే నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో చక్కెర్లు కొట్టారు. సత్యసాయి జిల్లా పర్యటనకు వీటీ- సీవీబీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు. -
అమ్మ రాధాకృష్ణా.. అమరావతిలో జాక్ పాట్ వెనుక ఇదీ అసలు కథ
-
రైతు చనిపోతే.. కుప్పకూలాడని రాస్తావా.. నీది మనిషి పుట్టుకేనా..
-
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
నిన్ను నమ్మం బాబూ!
-
అమరావతిలో భూదందా
ఇల్లెందు: ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందన్నట్టు..’ గా అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం తీరు అలా ఉందని రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (మాస్లైన్ అనుబంధం) జాతీయ మహాసభలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈ సభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరిట ల్యాండ్ పూలింగ్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు.ఆ భూమిలో రాజధాని నిర్మాణం చేపట్టకపోగా మరో 20 వేల ఎకరాలు ఇస్తే రాజధానిని నిర్మిస్తామని చెబుతుండడంపై ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం కాబోతోందన్నారు. దీన్ని కాపాడుతామని ఎన్నికల ముందు చెప్పిన నేతలు.. ఇప్పుడు మోదీ సర్కార్కు తలొగ్గి ఇష్టారాజ్యంగా కార్పొరేట్ సంస్ధలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిలో మరోమారు భూములు తీసుకునేందుకు సాగుతున్న యత్నాలపై తమతోపాటు కలిసి వచ్చే శక్తులతో పోరాటం సాగించనున్నట్టు శోభనాద్రీశ్వరరావు తెలిపారు.తొలుత అఖిల భారత ఐక్య రైతు సంఘం సభల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ నేతృత్వాన ఫాసిస్టు పాలన సాగుతోందని, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లోని కారి్మకుల మాదిరిగా రైతాంగం ఐక్యతను ప్రదర్శించకపోవడం వల్లే హక్కులు సాధించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోని రైతాంగాన్ని ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిరి్మంచాలని ఆయన సూచించారు. -
ABN రాధాకృష్ణ కొడుకు, కూతురు..! ఎన్ని వేల ఎకరాలు కొన్నాడంటే
-
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?
-
సీఎం సన్నిహితులకేనా జాక్పాట్?
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్ బైపాస్ పక్కనే నివాస, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్పాట్ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్లలో సీఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. బెజవాడ రమేషా.. మజాకా! తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా(ప్ర«దాన రాజధాని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలుగు రోడ్ల జంక్షన్ (కూడలి)లో బెజవాడ రమేష్, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు బిట్స్ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్–6 ప్రధాన రహదారికి ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్పాట్ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్ 30న రిజి్రస్టేషన్ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లుధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర ఎన్10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్కు సమీపంలో ఎన్11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. ఇదిగో ప్లాట్ల మాయాజాలం! రైతుల్లో ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతోపాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు. -
మేము భూములు ఇవ్వకపోయినా బెదిరించి లాక్కుంటున్నారు..
-
అమరావతి నిర్మాణంపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
-
కూటమికి షాక్.. బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. -
బలుసుకు మరో రూ.98.1 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేకూర్చింది. 220 కేవీ విద్యుత్ లైన్ మార్పు పనుల అంచనా వ్యయాన్ని రూ.1,082.44 కోట్ల నుంచి రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపాల వల్ల ఎన్ 10–ఈ1 జంక్షన్ నుంచి ఎన్ 13–ఈ1 జంక్షన్ వరకు 220 కేవీ ఈహెచ్వీ(ఎక్స్ట్రా హైవోల్టేజ్) లైన్ను మార్చాల్సి వచ్చింది. ఈ లైన్ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంలో ఏర్పాటు పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. 2004 నవంబర్ 20న జారీ చేసిన జీవో 133 ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ ఎల్–1గా నిలిస్తే ఆ టెండర్ను రద్దు చేసి మళ్లీ పిలవాలి.కానీ.. బలుసు శ్రీనివాసరావు ముఖ్యనేతకు సన్నిహితుడు కావడం, ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో నిబంధనలను తుంగలో తొక్కి ఆ టెండర్ను ఆమోదించారు. ఈ పనులను రూ.1,082.44 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అప్పగిస్తూ 2025 మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖజానాపై రూ.89.19 కోట్ల భారం పడింది. ఆ మేరకు బలుసుకు ప్రయోజనం చేకూరింది. ఆర్సీసీ పవర్ డక్ట్ నిర్మించాలంటూ.. చంద్రబాబు సర్కారు అంతటితో ఆగలేదు సరి కదా.. బలుసుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా మరో అడుగు ముందుకేసింది. 220 కేవీ ఈహెచ్వీ లైన్ ఏర్పాటుకు ఆర్సీసీ పవర్ డక్ట్› నిర్మించాల్సి వచ్చిందని.. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు సవరించాలంటూ సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదించారు. దీన్ని గత నెల 23న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 60వ సమావేశం ఆమోదించింది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన ప్రతిపాదనను అమలు చేయాలంటూ గత నెల 24న సీఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.దాని ఆధారంగా 220 కేవీ ఈహెచ్వీ లైన్ మార్పు పనుల వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అదనంగా మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ విద్యుత్ లైన్ మారి్పడి పనుల్లోనే బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు రూ.187.29 కోట్ల ప్రయోజనం చేకూరిందని.. ముఖ్యనేతకు బలుసు సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం మోపుతూ సన్నిహితులకు ముఖ్యనేత లబ్ధి చేకూర్చుతున్నారంటూ విద్యుత్ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. -
చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు: జోగి రమేశ్
తాడేపల్లి: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు వరుసబెట్టి కలెక్టర్లతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని, కాన్ఫరెన్సుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేతలు శూన్యమని విమర్శించారు.‘‘రైతులు ధాన్యం కొనాలని మొత్తుకుంటుంటే గోనె సంచులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు. అకాల వర్షాలు పడుతుంటే కలెక్టర్లను రైతులను అండగా పంపాలి. కానీ విజయవాడ పిలిచి కాన్ఫరెన్స్ ల పేరుతో సొల్లు మాటలు చెప్తున్నారు. ఏడుసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టి రైతులకు ఏం న్యాయం చేశారు? గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవటం లేదు. మార్కెట్ యార్డుల్లో రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. కలెక్టర్లతో రైతుల కష్టాలు చూడామని చంద్రబాబు చెప్పాలి. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులు కష్టాలు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ లో తిరుగుతున్నారు. చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి? రైతులకు గానీ, ఇతర ఏ వర్గానికైనా మేలు చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలయినా తీర్చారా? సినిమా డైలాగులు చెప్పటం తప్ప చంద్రబాబు ఇంకేం చేస్తున్నారు? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే సూపర్ సక్సెస్ అని ఎలా అంటారు? సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్. రైతులు అల్లాడి పోతుంటే కాన్ఫరెన్స్ లో సొల్లు కబుర్లు ఎందుకు? అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే కలెక్టర్లను విజయవాడ పిలిచి మీటింగులు ఎందుకు? ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీ పనిలో ఉన్నారు’’ అని ప్రశ్నించారు. -
సీఎం కోడలు కొనుగోలు చేసిన భూములపై CBI ఎంక్వైరీ జరగాల్సిందే!
-
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
రెండో విడత భూ సమీకరణపై భగ్గుమన్న రైతులు
తాడికొండ: అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై రైతులు భగ్గుమన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి యూనిట్–2లో సీఆర్డీఏ అధికారులు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా రైతులతో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని నిలదీశారు. గతంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను 12 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, రెండో విడతలో భూములిచ్చే రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులు పడినట్టు తాము ఇబ్బందులు పడలేమని తేల్చిచెప్పారు. పదేళ్ల క్రితం రైతులకు ఇచ్చినట్టుగానే 1,200 గజాలు ఇస్తే ఎలా సరిపోతుందని నిలదీశారు.తమకు 1,500 గజాల స్థలం, అప్పులు తీర్చుకునేందుకు రుణమాఫీ కింద రూ.3 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పక్కనే ఉన్న వెంకటపాలెం రైతులకు 1,450 గజాలు, మంగళగిరిలో అప్రూవల్ ప్లాట్లకు 1,800 గజాలు ఇస్తున్నప్పుడు తమకు 1,200 గజాలు ఇవ్వడం న్యాయమేనా అని మండిపడ్డారు. తమ భూములు ఇవ్వాలంటే స్పష్టమైన హామీ, సమయ పాలనతో కూడిన అగ్రిమెంట్ చేస్తేనే ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. బలవంతంగా తమ భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్పై అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. గ్రామ కంఠాల పేరుతో కొంతమందికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అలవెన్సులు ఇచ్చినప్పుడు భూములు త్యాగం చేసిన తమకు తాము కోరుకున్న విధంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నల వర్షం కురిపించారు.తొలి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేసిన తరువాతే తమ భూముల జోలికి రావాలని, మరికొందరు రైతులు అభిప్రాయం వ్యక్తం చేయగా.. అసలు భూములిచ్చేది లేదని మరికొందరు స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. గ్రామస్తులకు, మీడియాకు ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్రామ సభలు నిర్వహించడంపై పలువురు రైతులు మండిపడ్డారు. గ్రామసభలు జరిగే రైతులకు మాత్రం ముందురోజు సమాచారం ఇస్తుండటంతో రైతులంతా హాజరు కాలేని పరిస్థితి నెలకొంటోంది. కనీసం రెండు రోజుల ముందైనా సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు భారీ అవినీతి
-
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్టైం రికార్డు
సాక్షి,విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. మంగళవారం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. ఫలితంగా అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. స్వల్ప కాలంలో చంద్రబాబు పాలన అప్పు రూ.3,62,855 కోట్లకు చేరింది. తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిన సీఎంగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3,62,855 కోట్లు అప్పు చేసింది. అంటే సగటున రోజుకి రూ.15,766 కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.2,02,964 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లుగా ఉన్నాయి. -
రాజధాని అనేది ఫొటోలోనే.. నిజం అది మునిసిపాలిటీకి కూడా పనికిరాదు
-
అమరావతి టూ హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. లోకేష్ సమాధానం.. ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి
-
‘రాజధాని అమరావతి ఓ భ్రమ’
అనంతపురం: రాజధాని అమరావతి ఓ భ్రమ అని ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసమే అమరావతి పేరుతో రాజధాని ఎపిసోడ్ను తీసుకొచ్చారన్నారు. అనంతపురంలో జరిగిన ఓ సదస్సులో ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య ప్రసంగిస్తూ.. రాజధాని అమరావతి అనేది భ్రమ తప్పితే ఏమీ లేదన్నారు. ‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు వృథా చేశారు. 2014-19 మధ్య 33 వేల ఎకరాలతోనే సింగపూర్ తరహా రాజధాని చేస్తానన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారు. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. అమరావతి నిర్ణయాలు రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. -
పబ్లిసిటీ ఫుల్, సంక్షేమం నిల్ అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల పెన్షన్ పై లేదు
-
నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!
-
అద్దాలకే 2,540 కోట్లా..! సమాధానం చెప్పలేక ఎల్లో మీడియా ఎదురుదాడి
-
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
అమరావతి భవనాల అద్దాలకు అక్షరాలా రూ.2540 కోట్లు
-
అమరావతిలో అలంకరణలకు 3 వేల 338 కోట్ల రూపాయలు... ఏపీలో మరో గోల్మాల్కు రంగం సిద్ధం
-
‘ముఖ్య’నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ రైట్.. ‘పూలింగ్’.. పక్కా ప్లానింగ్!
సాక్షి, అమరావతి: రాజధాని రెండో విడత భూసమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం! 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి కారుచౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చ ముఠా.. ఇప్పుడు రెండో విడత భూసమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు. సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో 53,749.49 ఎకరాలను రాజధానిగా 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37,941.58 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తామని పేర్కొంది. అయితే 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మలి విడతలో మరో 44 వేల ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులు ఇచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే.. మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి అయితే వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు సీఆర్డీఏ ఇస్తుంది.పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీగా లబ్ధి..భూసమీకరణతో ప్రయోజనం స్వల్పమే.. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూసమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్లను తెరపైకి తెస్తున్నారు. మలి విడత భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి వి«ధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ చేశారు.అంటే.. అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం–2025లో పదో నిబంధనను అడ్డుపెట్టుకుని లేఅవుట్లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సీఆర్డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల.. ఆ లేవుట్లో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు(25,861.04 చదరపు గజాలు) పుట్టి రామచంద్రరావుకు వస్తుంది.ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే.. ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1,959.6 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వస్తుంది. ఇక మల్లవరపు లక్షి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందిన భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు పెదపరిమిలో 3.8301 ఎకరాల్లో లేఅవుట్ అనుమతి కోసం అందచేసిన దరఖాస్తుపై ఏప్రిల్ 6న సీఆర్డీఏ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల వారికి 9,408.91 చదరపు మీటర్లు (11,252.97 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అదే వారు భూసమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగిస్తే.. 3,830.1 చదరపు గజాల ఇంటి స్థలం, 766 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వచ్చేది.రాజధాని నిర్మాణానికి అదనంగా భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం(భూసమీకరణ పథకం)– 2025 విధి విధానాలను 2025 జూలై 1న ప్రభుత్వం జారీ (జీవో ఎంఎస్ నెంబరు 118) చేసింది.పల్నాడు జిల్లాలో అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి.. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 విధి విధానాల ప్రకారం సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెంబరు 252) జారీ చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో భూసమీకరణ యూనిట్–1 కింద 3,072.23 ఎకరాలు.. భూసమీకరణ యూనిట్–2 కింద 3,056.72 ఎకరాలను సమీకరించేందుకు ఏప్రిల్ 13న సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ..పెదపరిమి భూసమీకరణ నోటిఫికేషన్ జారీకి సరిగ్గా వారం ముందు అంటే ఏప్రిల్ 6న అదే గ్రామంలో సర్వే నెంబరు 447/1బీ(పీ), 447/1సీ(పీ), 447/2లో 9.798 ఎకరాలలో పుట్టి రామచంద్రరావు వేసిన లేఅవుట్కు.. సర్వే నెంబరు 82/బీ(పీ)లో 3.8301లో మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ తీసుకున్న సన్ సిరి ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ కేపిటల్ మేనేజింగ్ పార్టనర్లు భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావుæ వేసిన లేఅవుట్కు సీఆర్డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చేశారు.ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 పదో నిబంధన ప్రకారం వీజీటీఎం, ఉడా, సీఆర్డీఏ, డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను భూసమీకరణ నుంచి మినహాయించాలి. అంటే.. పుట్టి రామచంద్రరావు, భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు వేసిన లేఅవుట్లకు సంబంధించి 13.8301 ఎకరాలకు భూసమీకరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా వారికి భారీ ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాక.. లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం ముందు లేఅవుట్లకు అనుమతి ఇవ్వడంపై రాజధాని రైతులు విస్తుపోతున్నారు. ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే సన్నిహితులకు ఒక న్యాయం.. తమకో న్యాయమా..! అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. -
టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా
-
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
బాబుపై చింతా మోహన్ సెటైర్లు.. రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి పెడుతున్నావ్
-
అమరావతిలో మరో భారీ దోపిడీకి స్కెచ్
-
ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ స్కామ్!
సాక్షి,ఢిల్లీ: ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్ను రిటైల్ అవుట్లెట్స్ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ఆదేశాల వెనుక వందల కోట్ల స్కాం ఉన్నట్లు బయటపడింది. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.50. రిటైల్ బంకుల్లో ధర రూ.98 కాగా, బల్క్లో రూ.153. రిటైల్ బంకుల నుంచి డీజిల్ను రవాణా చేయాలని ప్రభుత్వం సూచించడం ద్వారా ప్రతి లీటర్పై రూ.50 లాభం వచ్చేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ లాభాల్లో వాటాలు పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు ఈ కుట్ర బహిర్గతమైంది -
‘కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం’
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని..క్యూలో నిలబెట్టే ప్రభుత్వం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఇంధన సంక్షోభంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు సినియరిటీ..విజనరీ ఎవరికి కావాలి?. పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది.కూటమి సర్కార్కు పబ్లిసిటీ తప్ప.. ఏమీ చేతకాదు. స్టాక్ లేక బంకులు మూసివేశారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం. గ్యాస్,పెట్రోల్,డీజిల్, యూరియా కోసం ప్రజల్ని, రైతులను క్యూలు కట్టిస్తున్నారు. వరి కోతలు..ఆక్వా కల్చర్కు డీజిల్ లేని దుస్ధితి.కూటమీ ప్రభుత్వం ఫెల్యూర్ గవర్నమెంట్.. పబ్లిసిటీ తప్పా ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఐదు రోజుల నుండి సీఎం ఆగ్రహం అంటున్నారు. సీఎం ఆగ్రహనికి విలువలేదా? కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల్ని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదుకున్నారో గుర్తు తెచ్చుకోవాలని హితువు పలికారు. -
ఏపీలో ఇంధన కొరత.. చంద్రబాబు సర్కారుపై వైవీ ఆగ్రహం
సాక్షి,కృష్ణా: కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణాజిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ కొరత పై చర్చించాం. దేశంలో ఎక్కడా లేనంత కొరత ఏపీలోనే ఉంది. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా పోర్టులు పూర్తిచేయించేందుకు పోరాటం చేస్తాం. ఎన్నికల నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చాలా వేగంగా సాగింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు పూర్తయిపోతాయి.మే 5 నుంచి 10వ తేదీలోపు మచిలీపట్నం పోర్టును సందర్శిస్తాంపోర్టు అధికారులను అనుమతి కోరాం.అనుమతులు రాగానే తేదీని ప్రకటిస్తాం.రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తున్నారు. కేవలం పదివేల కోట్లు పోర్టులు,హార్బర్లకు ఖర్చు పెట్టలేరా . వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం పోర్టుల పనులు చేపట్టడం లేదు.రాష్ట్రంలో అన్ని పోర్టులు, హార్బర్లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.. పోరాటం చేస్తాం’అని హెచ్చరించారు. -
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,నక్కలపల్లి: అనకాపల్లి జిల్లా నక్కల పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలపై ఏథర్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయాపడ్డారు.అప్రమత్తమైన స్థానికులు వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచండంతో ఓ మహిళను అనకాపల్లికి చెందిన ఓ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నక్కపల్లి వైపు నుండి అడ్డురోడ్డు వైపు మహిళా కూలీలు నడుస్తూ వెళ్తుండగా.. వారి వెనక నుంచి ఏథర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రండి రండి..వద్దు రావొద్దు : చంద్రబాబు
బి.కొత్తకోట: చంద్రబాబు తంబళ్లపల్లె టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం రండి రండి అని పలుకుతూనే.. వద్దు వద్దు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితిపై తంబళ్లపల్లె టీడీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో అప్పటి టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.గత ఏడాది అక్టోబర్ నుంచి పార్టీకి ఇన్చార్జి లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల క్రితం అమరావతికి శంకర్ను, పార్టీ మండల అధ్యక్షులను చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన నివాసంలో సమావేశం నిర్ణయించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు, వెళ్లిపోండి అని సమాచారం అందడంతో వెళ్లిన వారంతా నిరుత్సాహంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది.శనివారం సాయంత్రం శంకర్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆదివారం ఉదయం అమరావతి రావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆహ్వానం వస్తుందా అని కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు ఈ పిలుపు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అప్పటికప్పుడు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే మళ్లీ కబురొచ్చింది. వద్దు వద్దు మీరు రాకండి.. మళ్లీ ఎప్పుడు వచ్చేది చెబుతామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం గంటల్లోనే నీరుగారిపోయింది -
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.


