సాక్షి,తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటు కోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. అనంతరం, అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.
అంతేకాదు, నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్ది నిమిషాలు అక్కడే తిరుగాడి సమీప అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలకు ఉపక్రమించారు.
అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ..‘తిరుమల అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం, ఆహార వనరులు అందుబాటులో ఉండటం వల్ల చిరుతలు అప్పుడప్పుడు మానవ నివాస ప్రాంతాలకు చేరుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు మోహరించాం’అని తెలిపారు.
ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రివేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


