సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం 2025–26ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుంది. ఈ పథకం ప్రకారం, పన్ను చెల్లింపుదారులు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్తో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే ఒక్కసారి చెల్లిస్తే, మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుంది.
దీని ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. OTS పథకం కింద చెల్లింపులు MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSCs) మరియు ఆన్లైన్ విధానాల ద్వారా చేయవచ్చు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు.


