ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం | Minister Ponguleti Srinivas Reddy Fires On KCR Allegations Over Govt | Sakshi
Sakshi News home page

ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం

Feb 27 2026 1:34 AM | Updated on Feb 27 2026 1:35 AM

Minister Ponguleti Srinivas Reddy Fires On KCR Allegations Over Govt

మీడియాతో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో పొన్నం, వివేక్‌

పేదలే ఇందిరమ్మ ప్రభుత్వ పేటెంట్‌

వెలుగుమట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

బాధితులకు ఇంటిస్థలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది

ప్రభుత్వ ప్రగతిని చూడలేకనే కేసీఆర్‌ అండ్‌ కో విష ప్రచారం

మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం, వివేక్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని కేసీఆర్‌ కుట్రలు చేస్తుంటే..బావ, బావమరిది హరీశ్‌రావు, కేటీఆర్‌ తెలంగాణ సమాజంపైన, ప్రభుత్వంపైన విషం కక్కుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు సూచించారు.

గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మాధవరెడ్డితో కలసి ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 2023 జూలై 15న వెలుగుమట్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పేదల ఇళ్లను కూలగొట్టించిందని చెబుతూ అప్పటి కూల్చివేత సంఘటనల ఫొటోలను మీడియాకు చూపారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా, మంత్రి పొంగులేటి పైవిధంగా స్పందించారు.

హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగించారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్యాయం చేశారని ఆరోపించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి బీఆర్‌ఎస్‌ గాలికి వదిలేసిందన్నారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని, పేదలే ఇందిరమ్మ ప్రభుత్వానికి పేటెంట్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామన్నారు. ‘వెలుగుమట్లలో అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తాం. ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూస్తాం’అన్నారు. 

పేదల కష్టాలు తీర్చేందుకు జలయజ్ఞం ప్రారంభించారు 
తన పాదయాత్రలో భాగంగా పేదల కష్టాలను నేరుగా తెలుసుకున్న దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి..వారి కష్టాలు తీరాలంటే గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నకు సమృద్ధిగా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. జలయజ్ఞంతో ప్రాణహిత–చేవెళ్ల సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బావ బావమరుదులు హరీశ్‌రావు, కేటీఆర్‌ వచ్చి మాట్లాడాలి. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీలో ఉండకుండా సాకులతో బయటకు పోతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..కానీ తాము కచ్చితంగా అవకాశం ఇస్తామని, సభకు వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని పొంగులేటి కోరారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. 

మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడినందువల్లే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్‌ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement