హైదరాబాద్: గ్రూప్ 1,గ్రూప్ 2 నూతన ఆఫీసర్ల శిక్షణకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్రెడ్డి తిలకించారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రూప్-1, గ్రూప్- 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘మీరు మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు,ఈ రోజు అధికారులు. ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. రాంజీ గోండు,కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపైన తిరుగుబాటు చేశారు.
కాకతీయ సామ్రాజ్యం పైన సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌర్వించబడుతున్నారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు,అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలి. మొదటి ఎన్నికల్లో దేశంలోనే అత్యదిక మెజార్టీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి తెలంగాణ బిడ్డ. 6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది.
టీజీపీఎస్ని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షల పైన అవగాహన ఉన్న వాళ్ళని చైర్మన్ గా,సభ్యులుగా నియమించాం. ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడింది. అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదే..ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు. నేను మెకానికల్గా మిమ్మల్ని కలవలేదు. ఎమోషనల్,అటాచ్మెంట్తో కలిసి పని చేశాను. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లి తండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం’ అని స్సష్టం చేశారు.


