ఖమ్మం: ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో మంత్రుల కన్నుపడిన కారణంగానే కూల్చివేతలు చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 26వ తేదీ) బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్.. ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇళ్ల కూల్చివేతలపాపం ఆ ముగ్గురు మంత్రులదే. భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్నుపడింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. కేసీఆర్ ఆదేశాలతోనే నేను ఇక్కడికి వచ్చాను. అసెంబ్లీలో భూదాన్ అంశాన్ని లేవనెత్తుతాం. కూలగొట్టిన చోటే గృహప్రవేశాలు చేయిస్తా’ అని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
‘2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి అంటే దాదాపు 1900 మందికి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు.రెండూన్నర ఏళ్ల కిందట ఏ మాటలైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?, పేదవాడి హక్కులు ఉన్న పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలు ఉన్నా...నోటికాడి ముద్ద లాక్కొని వాళ్లను మెడలు పట్టి గెంటేస్తున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.

కాగా, మంగళవారం ఉద్రిక్తత నడుమ వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పట్నుంచో ఉండే ఇళ్లను కూల్చివేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


