సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగానే రద్దీ అంచనా..
ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్కు చెందిన 'ట్రాన్స్కాలిటీ' సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా నియంత్రించి వాహనాల రాకపోకలను సుగమం చేయవచ్చని తెలిపారు.
రోడ్డు భద్రతే లక్ష్యం..
నగరంలో రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ మరియు ఆస్కి/ ASCI ప్రతినిధులు పాల్గొన్నారు.
🚦 Cyberabad Goes High-Tech: AI-Driven Traffic Management! 🤖
Cyberabad Police is exploring a world-class, AI-based predictive traffic management model to tackle congestion and enhance road safety.
@CPCYBERABAD Dr. M. Ramesh met with Dr. Lucas Ambul (CEO, Transcality, Zurich)… pic.twitter.com/dvj49vdvsS— Cyberabad Police (@cyberabadpolice) February 25, 2026


