కరీంనగర్ జిల్లా: ఎన్నికల్లో గెలవగానే కొందరు ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోతుంటారు. ఖరీదైన బైకులు, కార్లలో తిరుగుతుంటారు. గెలిపించిన ఓటర్లను పట్టించుకోరు. పదవి వస్తుందంటే పార్టీలు మారతారు. కరీంనగర్ 8వ డివిజన్ కార్పొరేటర్గా కాల్వ మల్లేశం ఇటీవల భారీ మెజార్టీతో గెలిచాడు. బుధవారం కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ స్వామిరెడ్డి–శ్యామల దంపతుల కుమారుడు నిఖిల్రెడ్డి వివాహం గ్రామంలో జరిగింది. కులవృత్తిలో భాగంగా కార్పొరేటర్ మల్లేశం పోలు పోసి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లికి వచ్చినవారు మల్లన్నా నువ్వు సూపర్ అంటూ ప్రశంసించారు.
ఓడినా.. గెలిచిన మనసు
హుజూరాబాద్: ఎన్నికల్లో గెలిచినవారు హామీలను మరిచిపోయే రోజుల్లో ఓడినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ నాయకుడు గుర్రం హరిబాబు కట్టుబడ్డాడు. మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయారు. వార్డులో ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 అందజేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. బుధవారం వార్డుకు చెందిన యంజాల భాగ్యవాసుల కుమార్తె శ్రావ్య వివాహానికి హాజరైన హరిబాబు వధూవరులను ఆశీర్వదించి ఓడినా సరే మాట ప్రకారం కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు. పెళ్లికే కాకుండా వార్డులో పుట్టే ఆడబిడ్డకు నగదు అందజేస్తానని ప్రకటించాడు. హరిబాబును చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


