దుర్గా పరమేశ్వరి రథోత్సవం
మైసూరు: జిల్లాలోని కేఆర్ నగర తాలూకా హంపాపురలోని శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మ రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో రమణీయంగా జరిగింది. రథోత్సవం, జాతర మహోత్సవంలో కన్నడనాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అలంకరించి ఊయల సేవ నిర్వహించారు. ఎమ్మెల్యే డి.రవిశంకర్, వేలాది మంది అమ్మవారికి జైకారాలు కొడుతుండగా రథాన్ని లాగారు.
ఆర్టీసీ డ్రైవరు.. అదే బస్సుకు బలి
మైసూరు: చామరాజనగర–గుండ్లుపేటె ప్రధాన రహదారిలో కడువిన కట్టె హుండి (కేకే హుండి) గ్రామంలో కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని ఆ సంస్థ డ్రైవరే మరణించడం గమనార్హం. గుండ్లుపేటె తాలూకా కబ్బళ్లి నివాసి, కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుభాష్ (33) మృతుడు. ఆయన కేకే హుండి వద్ద నడుచుకుంటూ వెళుతుండగా చామరాజనగర నుంచి గుండ్లుపేటె వైపునకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొని సుభాష్ పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడే మృత్యువాత పడ్డాడు. సుభాష్ తల్లి 5 నెలల క్రితం మరణించగా అప్పటి నుంచి ఎక్కువ సెలవులు పెడుతూ ఊరిలో ఉంటున్నాడు. ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ స్నేహరాజ్, ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి బస్సు డ్రైవరుపై కేసు నమోదు చేశారు.
పెళ్లి వేడుకలో విషాదం.. కుప్పకూలిన ఫొటోగ్రాఫర్
మైసూరు: ఆకస్మిక గుండెపోటు మరణాలు మళ్లీ కలవరం కలిగిస్తున్నాయి. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలోని జేఎస్ఎస్ కళ్యాణ మండపంలో వివాహ కార్యక్రమంలో ఫొటోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మరణించాడు. గుండ్లుపేటె తాలూకా బొమ్మనహళ్లికి చెందిన శంకరప్ప, గంగమ్మల కుమారుడు పరశివమూర్తి (38) కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ వివాహం ఫొటో, వీడియో తీసేందుకు వెళ్లగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడివారు అతనిని పరిశీలించగా చనిపోయాడు. దీంతో పెళ్లి సంబరంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి, అలాగే 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
ఆస్పత్రిలో పసికందు వేలు కట్
బనశంకరి: ఆరునెలలు పసికందు చేతి చిటికెన వేలు కట్ చేసిన వైద్య సిబ్బంది నిర్వాకమిది. ఈ మేరకు తల్లిదండ్రులు బెంగళూరు ఇందిరానగరలో ప్రైవేటు ఆసుపత్రిపై కేసు పెట్టారు. జలుబు, జ్వరం రావడంతో ఈనెల 19వ తేదీన చేరిన 6 నెలల పసికందును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అడ్మిట్ చేయాలనడంతో సరేనన్నారు. మంగళవారం డిశ్చార్జ్ చేయగా పసికందు చేతి వేలికి బ్యాండేజ్ ఉంది, ఇంటికెళ్లి అది తీయగా చేతి చిటికెన వేలు తెగిపోయి ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా ఏమీ జరగలేదని, ఇంటికెళ్లండి అని పంపించారని ఆరోపించారు. నర్సు నిర్లక్ష్యంతో శిశువుకు వేలు కట్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
ఆలయంలో దళితులపై దాడిపై ఫిర్యాదు
తుమకూరు: కుణిగల్ తాలూకా యడియూరు హోబళి పరిధిలోని తిగళరపాళ్య గ్రామంలో ఉన్న మూడలగిరి వేంకటేశ్వర దేవస్థానంలోకి దళిత మహిళ, బంధువులు వెళ్లబోగా, కొందరు అడ్డుకుని అవమానించడం తెలిసిందే. బాధితురాలు రోజా అమృతూరు పోలీసు స్టేషన్లో జయమ్మ, శ్రీనివాస్, పూజారి హనుమయ్య తదితరులపై ఫిర్యాదు చేసింది. తనను అడ్డుకోవడమే కాకుండా తనను, తన చెల్లిని, తల్లిని జట్టుపట్టుకుని గెంటివేశారని తెలిపింది. తన మొబైల్ఫోన్ను లాక్కొన్నారని తెలిపింది. కాగా దళిత నేత, హోంమంత్రి పరమేశ్వర్ సొంత జిల్లాలోనే దళితులపై ఆగడాలు జరగడంపై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి.
దుర్గా పరమేశ్వరి రథోత్సవం
దుర్గా పరమేశ్వరి రథోత్సవం


