40 వేల ఉద్యోగాలను భర్తీ చేశారా?
● బీజేపీ నేత విజయేంద్ర ప్రశ్న
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామంటున్న సీఎం సిద్దరామయ్య.. అందుకు సాక్ష్యాధారాలను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. నగరంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే, అందుకు ఆధారాలను విడుదల చేయడానికి వెనుకంజ ఎందుకు అని ప్రశ్నించారు. ధార్వాడలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి విరుద్ధంగా ధర్నా చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. అనేక రోజుల నుంచి ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉండడంతో ఇటువంటి సమస్యలు వారి దృష్టికి రావడం లేదని ధ్వజమెత్తారు. సీఎం కుర్చీ రగడతో ఇటువంటి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ యువకులతో మాట్లాడే సమయం కూడా లేదా? అన్నారు. సిద్దరామయ్య, రాహుల్గాంధీకి తెలియదా అన్నారు. ఇప్పుడు 24,300 ఉద్యోగాలను నాలుగైదు నెలల్లో భర్తీ అంటున్నారు, ఎస్సీ రిజర్వేషన్ల కేసును సాకుగా చూపి ఆలస్యం చేయవద్దు అని డిమాండ్ చేశారు.


