పబ్లిక్‌ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం | CM Revanth Reddy announces 200 Telangana Public Schools in Telangana | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం

Feb 27 2026 1:55 AM | Updated on Feb 27 2026 1:55 AM

CM Revanth Reddy announces 200 Telangana Public Schools in Telangana

సీఎం రేవంత్‌కు డాక్యుమెంట్‌ను అందజేస్తున్న ఆకునూరి మురళి. చిత్రంలో కేకే, వేం నరేందర్‌రెడ్డి, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేశ్, కె.జ్యోత్స్న శివారెడ్డి

ప్రతి నియోజకవర్గంలో టీపీఎస్‌ ఏర్పాటు చేయాలి

ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా కమిషన్‌ సిఫారసులు

12వ తరగతిలో మాత్రమే బోర్డ్‌ పరీక్షలుండాలి

నర్సరీ నుంచే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి

ఈఏపీ సెట్‌ రద్దు..ఇంటర్‌ మార్కులతో ఇంజనీరింగ్‌ సీటు

సీఎం రేవంత్‌రెడ్డికి డాక్యుమెంట్‌.. వివరాలు వెల్లడించిన చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అన్ని సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా కమి షన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో పాఠశాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని కోరింది. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ ను ప్రభుత్వం సమకూర్చాలని పేర్కొంది. ఈ మేర కు రూపొందించిన తెలంగాణ విద్యా విధానం డాక్యుమెంట్‌ను గురువారం సీఎంరేవంత్‌రెడ్డికి అందజేసింది. నివేదికలోని అంశాలను కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి మీడియాకు వివరించారు. 

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు ప్రారంభించాలి
‘పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి చేసేందుకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రారంభించాలి. ఒకటవ తరగతి నుంచే తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ భాషలతో కూడిన విధానాన్ని అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే బోధనా మాధ్యమం ఇంగ్లిష్‌లో ఉండటం ప్రయోజనకరం. ప్రస్తుతం ఉన్న 6–14 ఏళ్ల పరిమితిని 3 నుండి 18 సంవత్సరాలుగా మార్చి నిర్బంధ విద్యను అందించాలి. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సును రద్దు చేయాలి. బి.ఎడ్‌ను ప్రైమరీ (నర్సరీ–5వ తరగతి), సెకండరీ (6–12వ తరగతి) గా విభజించాలి.

కోచింగ్‌ వ్యాపారాన్ని నిషేధించాలి
మధ్యాహ్న భోజనానికి ఇచ్చే ధరను పెంచాలి. మెనూలో గుడ్డు, అరటి పండు ఉండేలా చూడాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్‌ నిర్వహించాలి. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్‌ను రద్దు చేసి, ఇంటర్‌ మార్కుల ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల పేరుతో నిర్వహించే పోటీ పరీక్షల కోచింగ్‌ వ్యాపారాన్ని నిషేధించాలి. 

ఫీజుల నియంత్రణకు కమిషన్‌
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమా రు 72 శాతం రెగ్యులర్‌ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను అంచనా వేయడా నికి ‘తెలంగాణ ఎడ్యుకేషన్‌ స్టాండర్డ్స్‌ అథారి టీ’ని ఏర్పాటు చేయాలి. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో  ఫీజులను నియంత్రించడానికి చట్టబద్ధమై న కమిషన్‌ ఏర్పాటు చేయాలి. విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలి..’ అని సిఫారసు చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా విధానం అమలు కోసం ఏడేళ్ల రోడ్‌ మ్యాప్‌ను కమిషన్‌ సిద్ధం చేసింది. దీని ద్వారా సుమారు 2 వేల పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొంది. మీడియా సమావేశంలో కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చారకొండ వెంకటేశ్, కె.జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement