బెంగాల్‌లో ఈడీ దాడుల టెన్షన్‌.. సీఎం మమత ర్యాలీ | CM Mamata Banerjee leads rally Against ED raid on I-PAC | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ఈడీ దాడుల టెన్షన్‌.. సీఎం మమత ర్యాలీ

Jan 9 2026 3:41 PM | Updated on Jan 9 2026 3:46 PM

CM Mamata Banerjee leads rally Against ED raid on I-PAC

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఐప్యాక్‌ చీఫ్‌ ప్రతీక్‌ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్‌లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనార్జీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ నేతలు. సీఎం మమత చేపట్టిన ర్యాలీలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మరోవైపు.. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తోందని అమిత్‌షాపై టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్‌ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.

ఈ నిరసనల్లో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్‌, కీర్తి ఆజాద్‌, డెరెక్‌ ఓబ్రియన్‌ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం, ఎంపీలు మాట్లాడుతూ.. ‘‘ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోంది’’ అని డెరెక్‌, మహువా వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనలకు తావులేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. నిరసనకారులను జైలుకు పంపి.. రేపిస్టులకు బెయిల్ ఇస్తున్నారు. ఇది బీజేపీ విధానం. దీనిని బెంగాల్ అంగీకరించదు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం’ అని అభిషేక్‌ బెనర్జీ ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఇక, సోదాలు అడ్డుకున్నారని ఈడీ.. వాటిని ప్రశ్నిస్తూ ఐప్యాక్‌ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాయి.

ఇదిలా ఉండగా.. కోల్‌కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐ-ప్యాక్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) గురువారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. ఈడీ సోదాల సందర్బంగా అధికారుల వద్ద నుంచి సీఎం మమతా బెనర్జీ పలు ఫైల్స్‌ను తీసుకెళ్లారు. దీంతో, ఈడీ దాడుల ఘటన బెంగాల్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement