కోల్కతా: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ మీడియాకు తెలిపారు.
గడచిన రెండు, మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర షిప్పింగ్, రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ వెన్నంటి ఉండి టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.
అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 నుండి 2021 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఆయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ గూటికి చేరారు. ఈ ఫిరాయింపు అంశంపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ముకుల్ రాయ్ మృతిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని, బీజేపీలో ఉన్న సమయంలో ఆయనకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు.


