కోల్కతా: జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సారథ్య బాధ్యతలను ప్రాంతీయ పార్టీల నేతలకు అప్పగించాలని ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈ కూటమికి అసలైన నాయకురాలిగా అభివర్ణించిన అయ్యర్.. ఆమె లేకుంటే ‘ఇండియా’ కూటమి ఉనికికే ప్రమాదమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోల్కతాలో మీడియాతో మాట్లాడిన మణిశంకర్ అయ్యర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నేతలకు పగ్గాలు అప్పగించి, రాహుల్ గాంధీ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గతంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అయ్యర్ బెంగాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల కోసమే మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ తెరచాటున బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించిన ఆయనకు పార్టీ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఈ పరిణామాలపై ఆచితూచి స్పందిస్తోంది. ప్రస్తుతం తమ దృష్టంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, నాలుగోసారి మమతా బెనర్జీ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న తరుణంలో అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు కూటమిలోనూ, ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అలజడి రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mexico: డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం


