మెక్సికో సిటీ: ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్జీ) అధినేత నెమీసియో ‘ఎల్ మెంచో’(59) మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో హతమయ్యాడు. ఆదివారం పశ్చిమ మెక్సికోలోని జలిస్కో రాష్ట్రం, తపాల్పా పట్టణంలో సైన్యం నిర్వహించిన రహస్య ఆపరేషన్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎల్ మెంచోను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడని, మెరుగైన చికిత్స కోసం మెక్సికో సిటీకి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
సుమారు 15 మిలియన్ డాలర్ల(రూ. 136.15 కోట్లు) అమెరికన్ రివార్డు కలిగిన ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.తమ నాయకుని మరణవార్త తెలియగానే కార్టెల్ ముఠా సభ్యులు జలిస్కో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. సుమారు 20కి పైగా ప్రధాన రహదారులను ట్రక్కులు, కార్లతో దిగ్బంధించి నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనలు మిచోకాన్ రాష్ట్రంతో పాటు ప్యూర్టో వల్లర్టాకు కూడా వ్యాపించాయి. సైనిక చర్యలో ఎల్ మెంచోతో పాటు ఆరుగురు సాయుధ దుండగులు హతం కాగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
ఘటనా స్థలంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన భద్రతా దళాలు, విమానాలను సైతం కూల్చివేయగల రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ దేశ ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. హింస చెలరేగిన కారణంగా జలిస్కో రాజధాని గ్వాడలజారాలో జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బహిరంగ సభలను రద్దు చేయడంతో పాటు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అగ్రరాజ్యం అమెరికాకు కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలను సరఫరా చేయడంలో ఎల్ మెంచో ముఠాది కీలక పాత్ర. గతంలో పట్టుబడిన ‘ఎల్ చాపో’ గుజ్మాన్ తరహాలోనే ఎల్ మెంచోను ప్రమాదకర ఉగ్రవాదిగా అమెరికా పరిగణిస్తోంది. ఈ ఆపరేషన్లో మెక్సికో సైన్యానికి అమెరికా నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి. ఎల్ మెంచో అంతం మెక్సికోకే కాక ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాపై సాగుతున్న పోరాటంలో ఒక గొప్ప మలుపు అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో మెక్సికో వైఫల్యంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంపై సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
ఈ హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా ప్రభుత్వాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. మెక్సికోలోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. పలు అమెరికన్, కెనడియన్ విమానయాన సంస్థలు మెక్సికోకు నడిచే విమాన సర్వీసులను రద్దు చేశాయి.


