ట్రిపోలి: లిబియా మాజీ పాలకుడు ముఅమ్మర్ గడ్డాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడ్డాఫీ (53) దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ లిబియాలోని జింతాన్ నగరంలోని ఆయన నివాసంలోకి నలుగురు సాయుధ దుండగులు చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన తరఫు ఫ్రెంచ్ న్యాయవాది మార్సెల్ సెకాల్డి తెలిపారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నివాసంలోకి చొరబడిన సాయుధ కమాండోలు, తొలుత అక్కడి నిఘా కెమెరాలను పనిచేయకుండా చేసి, ఆపై సైఫ్ అల్ ఇస్లాంను కాల్చి చంపారని ఆయన సలహాదారు అబ్దుల్లా ఉస్మాన్ అబ్దురహీం స్థానిక టీవీ ఛానెల్కు వెల్లడించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదు.
ముఅమ్మర్ గడ్డాఫీ హయాంలో ఎలాంటి అధికారిక పదవిలో లేకపోయినప్పటికీ, సైఫ్ అల్-ఇస్లాం లిబియా ‘డి ఫ్యాక్టో’ ప్రధానమంత్రిగా వ్యవహరించేవారు. ఒకప్పుడు సంస్కరణవాదిగా ముద్ర వేయించుకున్న ఆయన, 2011 అరబ్ స్ప్రింగ్ తిరుగుబాటు సమయంలో అణచివేతకు పిలుపునిచ్చి తీవ్ర విమర్శలపాలయ్యారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
2011లో గడ్డాఫీ పతనం తర్వాత అరెస్టయిన సైఫ్కు, 2015లో ట్రిపోలీ కోర్టు మరణశిక్ష విధించినప్పటికీ, తర్వాతి కాలంలో ఆయనకు క్షమాభిక్ష లభించింది. చాలా కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న సైఫ్ అల్-ఇస్లాం, 2021లో లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆ ఎన్నికలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఆయన భద్రతపై గత కొన్ని రోజులుగా ఆందోళనలు ఉన్నాయని, గడ్డాఫీ తెగకు చెందిన పెద్దలు భద్రతను పెంపొందిస్తామని ప్రతిపాదించినా సైఫ్ తిరస్కరించినట్లు సమాచారం.
సైఫ్ హత్యను ఆయన మద్దతుదారులు ద్రోహంగా అభివర్ణించారు. సైఫ్ అల్ ఇస్లాం మృతి లిబియా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో గడ్డాఫీ పాలన అంతమైనప్పటి నుండి లిబియా అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. సైఫ్ మరణం ఆయన మద్దతుదారులలో ఆగ్రహాన్ని నింపంది. ఈ పరిణామం రాబోయే అధ్యక్ష ఎన్నికల సమీకరణాలను కూడా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో సంచలనం: ముస్లిం మహిళ కెప్టెన్ ఎలాకు పట్టం


