ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్కు ఆహ్వానం అందింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇరాన్–అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ఒక ఒప్పందానికి వచ్చేందుకు తటస్థ దేశం తుర్కియే వేదికగా త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయి.
శాంతి ప్రయత్నాలకు మరింత విస్తృతమైన గుర్తింపు, మద్దతు లభించేలా ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొనాలంటూ సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ తదితర దేశాలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదానికి ఇదే ప్రధాన అంశంగా మారింది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన పక్షంలో అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది.


