ఉత్తర అమెరికాలోని ప్రసిద్ధ నయాగరా జలపాతం ఇప్పుడొక అద్భుతమైన మంచు లోకంగా మారిపోయింది. 2026 జనవరి చివరి నుంచి ఏర్పడిన తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా ఈ ప్రాంతమంతా మంచు దుప్పటిని కప్పుకుంది. పర్యాటకులు ఈ గడ్డకట్టే చలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఇక్కడికి తరలివస్తున్నారు.
భారీగా పేరుకుపోయిన మంచుతో..
పాక్షికంగా గడ్డకట్టిన జలపాతాలు, మంచుతో నిండిన వృక్షాలు, పొగమంచుతో కూడిన మనోహరమైన దృశ్యాలను చూస్తూ, నిలువెల్లా పులికించిపోతున్నారు. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఈ జలపాతం ఎందుకిలా మారిపోయింది? ఈ భారీ జలపాతంలోని నీటి ప్రవాహం అధిక స్థాయిలో ఉండటంతో ఇది పూర్తిగా గడ్డకట్టకపోయినప్పటికీ, అంచులు, వంతెనలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకుపోవడంతో ఈ పర్యాటక ప్రాంతం ఒక మంచుతో కూడిన వింత ప్రపంచంలా మారిపోయింది.
‘పోలార్ వోర్టెక్స్’ కారణంగా..
నయాగరా జలపాతం పాక్షికంగా గడ్డకట్టడానికి ప్రధాన కారణం ఆర్కిటిక్ ప్రాంతం నుండి వీస్తున్న బలమైన శీతల గాలులు. సాధారణంగా ఉత్తర ధ్రువం వద్ద శీతల గాలిని బంధించి ఉంచే ‘పోలార్ వోర్టెక్స్’ (ధ్రువ సుడిగుండం) వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. 2026 జనవరిలో సంభవించిన స్ట్రాటోస్పిరిక్ వార్మింగ్ కారణంగా ఈ సుడిగుండం బలహీనపడి, ఉత్తర అమెరికా వైపు తీవ్రమైన చలి గాలులు ప్రవహించాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయి, భారీ మంచు తుఫానులతో ఈ ప్రాంతమంతా మంచుమయమైంది.
విపరీతమైన వాతావరణ మార్పులు
జలపాతాల నుండి వెలువడే తుంపరలు ఈ చలికి వెంటనే గడ్డకట్టి దట్టమైన మంచు పొరలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం కనిపిస్తున్న నయాగరా దృశ్యాలు శీతాకాలం నాటి విపరీతమైన వాతావరణ మార్పులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విపరీత శీతల ప్రభావం కేవలం ఉత్తర అమెరికాకే పరిమితం కాకుండా యూరప్, ఆసియా దేశాల్లోనూ కనిపిస్తోంది.
సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
భారతదేశంలో ప్రస్తుత శీతాకాలం ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో వణుకు పుట్టిస్తోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్కు పడిపోగా, గురుగ్రామ్లో దశాబ్దాల కనిష్ట స్థాయి 0.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా దట్టమైన పొగమంచు, సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ముంబై మేయర్ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ


