వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యం అమెరికాకు అవాంతరం ఎదురయ్యింది. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత మానవుణ్ని తిరిగి చంద్రుడి చెంతకు చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మార్చి నెలలో జరగాల్సిన ఈ ప్రయోగాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ప్రకటించారు.
స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్లోని హీలియం ప్రవాహ వ్యవస్థలో (Helium Flow) తలెత్తిన లోపాన్ని గుర్తించిన నిపుణులు.. మార్చి నెలలో అందుబాటులో ఉన్న ‘లాంచ్ విండో’ లోపు దాన్ని సరిదిద్దడం అసాధ్యమని తేల్చిచెప్పారు. దీంతో ఈ కీలక ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. ఈ పరిణామంపై స్పందించిన జారెడ్ ఐజాక్మన్.. ఈ వాయిదా శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రేమికులను నిరాశకు గురిచేస్తున్నదని అన్నారు.
అయితే 1960వ దశకంలో అసాధ్యమనుకున్న అంశాలను నాసా తన పరిశోధనలతో సుసాధ్యం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్పై ఉన్న భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్తో పాటు ఓరియన్ వ్యోమనౌకను తిరిగి వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్కు (వీఏబీ) తరలించి, పరిశీలన జరపనున్నారు. ఈ సాంకేతిక సమస్యపై పూర్తిస్థాయి వివరాలను వెల్లడించేందుకు నాసా త్వరలోనే ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ వ్యోమగామితో తలపెట్టిన ఈ 10 రోజుల యాత్ర, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారనుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న ఈ మిషన్, చైనా నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో వెట్ డ్రెస్ రిహార్సల్ జరిగింది. ఈ సమయంలో ద్రవ హైడ్రోజన్ లీకేజీ వంటి సమస్యలు తలెత్తినప్పటికీ, ఇటీవలే విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ తాజా లోపం వెలుగు చూసింది. కేవలం చంద్రుడే కాకుండా, భవిష్యత్తులో అంగారక గ్రహం (Mars) పైకి మానవ సహిత యాత్రలు చేపట్టేందుకు ఈ ఆర్టెమిస్ ప్రయోగాలు పునాదిగా నిలవనున్నాయి.
ఇది కూడా చదవండి: ‘టూ వీక్ రూల్’: ప్రాణాలను కాపాడే 14 రోజుల సూత్రం!


