అనాథ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యూఏఈ ప్రభుత్వం చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. 'మదర్ ఆఫ్ ది నేషన్ ఎండొవ్మెంట్' కార్యక్రమానికి యూఏఈ శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం 'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' (Erth Zayed Philanthropies) అనే సంస్థ 100 మిలియన్ దిర్హామ్ల (సుమారు రూ.225 కోట్లకు పైగా)ను విరాళంగా ప్రకటించింది.
యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం ఈ 'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' సంస్థను స్థాపించారు. అబుదాబీ కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ సంస్థ..యూఏఈ అంతర్జాతీయ మానవతా సాయం, స్వచ్ఛంద కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంటుంది.
ఈ సంస్థ చైర్మెన్గా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. కాగా ఈ 100 మిలియన్ దిర్హామ్లను అబుదాబి అవ్కాఫ్ పర్యవేక్షణలో ప్రత్యేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని యూఏఈలోని అనాథ పిల్లల విద్య, ఆరోగ్యం, వారి భవిష్యత్తు సాధికారత కోసం ఖర్చు చేయునున్నారు.


