ఉన్నత చదువు, ఉద్యోగం కోసం కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. తెలంగాణకు చెందిన శశికాంత్ రెడ్డి దొంతిరెడ్డి(30) గుండెపోటుతో అమెరికాలో మరణించాడు. హెచ్-1బి (వీసా రాకపోవడం, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కారణంంగా శశికాంత్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.
శశికాంత్ 2018లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కష్టపడి చదివి రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. తన చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ పలుమార్లు హెచ్-1బి వీసా లాటరీకి అతడు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా అతడు ఎంపిక కాలేదు. దీంతో శశికాంత్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్నేహితులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే గుండె పోటుకు గురై ప్రాణాలు విడిచాడు. శశికాంత్ ఓ సాప్టేవేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. 2018లో అమెరికా వెళ్లిన శశికాంత్, అప్పటి నుండి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. తమ బిడ్డ ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు అతడి కడచూపు కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా శశికాంత్ పార్థివ దేహాన్ని భారత్కు పంపేందుకు స్పేహితులు ఫండ్స్ సేకరిస్తున్నారు. మంగళవారం నుంచి శశికాంత్ మృతదేహం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. అయితే శశికాంత్ స్వస్థలం తెలంగాణలో ఎక్కడన్నది తెలియాల్సి ఉంది.


