అరిజోనా: ప్రముఖ అమెరికా టీవీ యాంకర్ సవన్నా గుత్రీ తల్లి మిస్సింగ్ కేసు ఒక మిస్టరీగా మారింది. 84 ఏళ్ల నాన్సీ గుత్రీ అదృశ్యమై మూడు వారాలు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. ఆమె ఆచూకీని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఏం జరిగిందంటే?
నాన్సీ గుత్రీ ఫిబ్రవరి 1న టక్సన్లోని తన నివాసం నుండి కిడ్నాప్నకు గురైంది. అంతకుముందు రోజు రాత్రి ఆమె ఇంటి తలుపు వద్ద ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఉండడం సిసిటివి దృశ్యాల్లో రికార్డ్ అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు.
అయితే నాన్సీ గుత్రీ ఆచూకీ లేదా కిడ్నాప్తో సంబంధం ఉన్న వారి వివరాలు తెలిపిన వారికి అధికారులు భారీ రివార్డు ప్రకటించారు. స్దానిక అధికారులు, దాతల సహకారంతో మొత్తంగా 202,500 డాలర్లు (సుమారు రూ. 1.68 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఇందులో ఎఫ్బీఐ (FBI) విడిగా ప్రకటించిన 100,000 డాలర్లు కూడా ఉంది.
ఒక మిస్సింగ్ కేసులో ఇంత భారీ రివార్డ్ ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా దర్యాప్తు బృందాలు తమ వేటను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు నాన్సీకి సంబంధించిన వేలిముద్రలు, డీఎన్ఏ, భౌతిక ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం వీటిని ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు.
మరోవైపు టక్సన్ నగరం మెక్సికో సరిహద్దుకు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉండటంతో, కిడ్నాపర్లు ఆమెను సరిహద్దు దాటించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అమెరికా ఫెడరల్ అధికారులు మెక్సికో భద్రతా దళాలకు సమాచారం అందించారు.
ఈ కిడ్నాప్లో డ్రగ్ కార్టెల్స్ లేదా వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే సవన్నా గుత్రీ కుటుంబానికి అజ్ఞాత వ్యక్తుల నుండి ఈమెయిల్స్ వస్తున్నాయి. నాన్సీని విడుదల చేయడానికి మిలియన్ల కొద్దీ డాలర్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఈమెయిల్స్ నిజంగానే కిడ్నాపర్లు పంపినవా లేక ఎవరైనా తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న కోణంలో ఎఫ్బీఐ విచారణ జరుపుతోంది.


