డ్రగ్స్ ముఠాలను అంతమొందించేందుకు యుద్దం చేస్తున్న అమెరికా.. తమ దాడులను మరింత ఉధృతం చేసింది. లాటిన్ అమెరికా తీరప్రాంత జలాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మూడు డ్రగ్స్ స్మగ్లింగ్ నౌకలపై అమెరికా సైన్యం సోమవారం క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు.
ఈ విషయాన్ని యుఎస్ సదరన్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ దాడులు తూర్పు పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రంలో జరిగాయి. పసిఫిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది, కరేబియన్ సముద్రంలో ఒక నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ఆపరేషన్లలో అమెరికా సైనికులకు ఎవరూ గాయపడలేదని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సెప్టెంబర్ నుంచి మాదకద్రవ్యాల ముఠాలపై యుద్దాన్ని ప్రకటించారు. ఈ స్పెషల్ ఆపరేషన్స్ వల్ల ఇప్పటివరకు దాదాపు 145 మంది అనుమానిత స్మగ్లర్లు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అపరేషన్స్పై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పందించారు.
"ట్రంప్ అధ్యక్షతన డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం సురక్షితం కాదు" అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అయితే ఈ దాడులపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నౌకల్లో నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో సైన్యం స్పష్టమైన ఆధారాలను బహిర్గతం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి


