జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల వెంట పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి దొంగచాటుగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్మీ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆర్ఎస్పురా సెక్టార్లో శనివారం రూ.40 కోట్లకు పైగా విలువ చేసే 6.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి వేళ అనుమానాస్పద డ్రోన్ కదలికలపై ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది.
అదేవిధంగా, పాక్ భూభాగం వైపు నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ఏదో వస్తువును జార విడిచిపెట్టిందంటూ అందిన సమాచారంతో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ మేరకు బస్పూర్ ప్రాంతంలోని నయీ బస్తీ కరోతానా గ్రామం వద్ద పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని పంట పొలాల్లో 6.582 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్లను జవాన్లు కనుగొన్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సరిహద్దులకు సమీపంలోని కథువా జిల్లాలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.


