టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.
సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్కప్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.
యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.
మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్కు పంపాడు.
ఆతర్వాత వచ్చిన నవ్నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది.
చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి.


