ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్గా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.

కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు.
మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్లు ఆడి 141.84 స్ట్రయిక్రేట్తో 1566 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన రియాన్ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. ఆ సీజన్లో అతను 149.21 స్ట్రయిక్రేట్తో 573 పరుగులు చేశాడు. గత సీజన్లో రియాన్ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్రేట్తో 393 పరుగులు) చేశాడు.
గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ 8 మ్యాచ్ల్లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్లో రియాన్ ఫుల్టైమ్ కెప్టెన్గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి.
కాగా, తదుపరి సీజన్కు రాయల్స్కు కెప్టెన్తో పాటు నూతన హెడ్ కోచ్ కూడా రానున్నాడు. గత సీజన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ వదవిని వదిలేయడంతో, ఆ స్థానంలో కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్ కలిసి 2026 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ను నడిపిస్తారు.
2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు..
రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పేరాల, షిమ్రోన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, యుద్ద్వీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పంజా, విజ్ఞేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్


