న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలు నేడు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ నిపుణులు మద్దతు పలుకుతున్నారు. పారిశ్రామికరంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్కు మద్దతు ప్రకటించడంతో చాలా చోట్ల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఒడిశా, కేరళలో..
బంద్ ప్రభావం ఒడిశా, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపిస్తోంది. ఒడిశాలో దాదాపు పూర్తిస్థాయి షట్డౌన్ వాతావరణం నెలకొంది. హోల్సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు స్తంభించాయి. కేరళలో కార్మిక యూనియన్ల బలం ఎక్కువగా ఉండటంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. అస్సాంలో కూడా పట్టణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కూడా పాఠశాలల మూసివేతపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే నిరసనల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పరిధిలోని కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి, ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించుకున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, ఇతర అత్యవసర వైద్య సేవలకు బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటివరకు సేవల నిలిపివేతపై ఎటువంటి వార్తలు అందలేదు.


