సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.
ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు.


