టెన్త్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు చేస్తున్న హిజ్రాలు
మన్యం జిల్లాలో వసతిగృహ సంక్షేమాధికారి నిర్వాకం
తాను టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడినంటూ హంగామా
కురుపాం: పాఠశాలలో హిజ్రాలతో నృత్యం చేయించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. ఇందులో సంబంధిత అధికారి హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించాడు. అక్కడితో ఆగకుండా వారితో విద్యార్థులను సైతం తైతక్కలాడించాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ నృత్యాలను సోషల్ మీడియాలో ఆదివారం చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు విస్తుపోయారు.
ఇదేమి తీరు అంటూ మండిపడ్డారు. ఉన్నత విలువలు నేర్పాల్సిన సరస్వతీ నిలయంలో ఇలా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. వసతిగృహ సంక్షేమాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, సంబంధిత వసతిగృహ సంక్షేమాధికారి తాను టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తాలూకా అని పలువురు అధికారుల వద్ద చెబుతూ వస్తుండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చంద్రబాబు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.



