ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి.. | Ghaziabad deaths fathers 2015 live in partner suicide resurfaces | Sakshi
Sakshi News home page

ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..

Feb 8 2026 9:08 AM | Updated on Feb 8 2026 12:15 PM

Ghaziabad deaths fathers 2015 live in partner suicide resurfaces

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు బాలికల తండ్రి చేతన్ కుమార్‌కు చెందిన పాత నేర చరిత్ర తెలియవచ్చింది. 2015లో చేతన్ కుమార్‌తో సహజీవనం చేసిన ఒక మహిళ, భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అది ఆత్మహత్యగా తేలడంతో ఆ కేసును మూసివేశారు.

ప్రస్తుత ఘటన నేపథ్యంలో పాత కేసు వివరాలను  పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్‌కు సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉండగా, వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లే కావడం గమనార్హం. మరణించిన బాలికలలో నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖీ (12) హీనా కుమార్తెలు. ఈ అసాధారణ కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితులు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

బాలికలు రాసిన ఆత్మహత్య లేఖలో కేవలం తండ్రి ప్రస్తావన మాత్రమే ఉందని, తల్లుల గురించి ఏమీ రాయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. 
బాలికల ఆత్మహత్యకు తండ్రి వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తొమ్మిది పేజీల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్, ఫోరెన్సిక్ బృందాలు.. ఆ చిన్నారులు వినియోగించిన ఫోన్‌లోని డిజిటల్ డేటాను సేకరించే పనిలో  ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధిత కుటుంబాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైందని పేర్కొంటూ, జిల్లా యంత్రాంగం, పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరారు. 

ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు..

Advertisement
 
Advertisement
Advertisement